తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజీనోవా దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్ధప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురై స్వల్ప గాయంతో బయటపడటంతో అన్నా లెనినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో బస చేసి..క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తల నీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట డిక్లరేషన్ పై సంతకం చేశారు.