YS Vijayamma : షర్మిల అరెస్ట్.. విజయమ్మ నిరాహార దీక్ష.. హైదరాబాద్కు జగన్!
YS Sharmila Arrest : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్తో హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు ఆమెను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరామర్శించేందుకు ప్రయత్నించగా.. విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వస్తారని వైఎస్ఆర్టీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
వైఎస్ షర్మిల అరెస్టు(YS Sharmila Arrest)పై వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు షర్మిల తల్లి విజయమ్మ(YS Vijayamma) పరామర్శించేందుకు వెళ్లడానికి ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ లోటస్పాండ్(Lotus Pond)లోని నివాసంలో నిరాహార దీక్షకు దిగారు. తన కూతుర్ని చూసేందుకు వెళుతుంటే అడ్డుకున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని ప్రశ్నించారు.
ట్రెండింగ్ వార్తలు
షర్మిల అరెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ప్రగతి భవన్ను షర్మిల ముట్టడించనున్నారన్న సమాచారంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. షర్మిల డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉన్నారు. కారును క్రేన్తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్(SR Nagar Police Station)కు షర్మిలను కారుతో సహా తరలించారు. అక్కడ షర్మిల కారు డోర్లు పోలీసులు తెరిచారు. షర్మిలను బయటకు రప్పించారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు.
మరోవైపు షర్మిల అరెస్ట్తో ఎస్ఆర్నగర్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్ఆర్టీపీ(YSRTP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. షర్మిలను విడుదల చేయాలని బిల్డింగ్ పైకి ఎక్కి కార్యకర్తల నినాదాలు చేశారు. విడుదల చేయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకేస్తామంటూ బెదిరించారు.
షర్మిల అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్(CM Jagan) హైదరాబాద్ వస్తారని వైఎస్ఆర్టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. దీనిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. వైఎస్ఆర్టీపీ నేతలు మాత్రం జగన్.. తన చెల్లెలు షర్మిలను చూసేందుకు వస్తారని చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
వైఎస్ షర్మిల ట్రాఫిక్(Traffic) కు అంతరాయం కలిగించారనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమెదు చేశారు. 333, 353,337 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసుల తీరుపై షర్మిల మండిపడ్డారు. పోలీసులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్.. బందిపోట్ల రాష్ట్ర సమితిగా తయారైందని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పోరాడుతున్నానని, తనను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.
ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో పర్యటన సందర్భంగా షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో వివాదం మొదలైంది. పాదయాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. నర్సంపేటలో జరిగిన దాడి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరిగిందని ఆరోపించారు.
షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వాహనాలను టీఆర్ఎస్(TRS) కార్యకర్తలు ధ్వంసం చేశారు. షర్మిల బస చేసే బస్సును దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. నర్సంపేటలో బహిరంగ సభ నిర్వహించకుండానే ఆమె యాత్ర ముగించాల్సి వచ్చింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోమవారం రాత్రి షర్మిలను హైదరాబాద్(Hyderabad) తరలించారు. దీంతో ఆమె కేసీఆర్(KCR) ఎదుట నిరసనకు దిగాలని నిర్ణయించారు. షర్మిలను బుజ్జగించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆమె వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు.
సంబంధిత కథనం