YS Sharmila : కేసీఆర్ గారు.. మీ పార్టీ ఆఫీసుల భూములు ప్రభుత్వపరం చేయండి
YSRTP Latest News: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోందంటూ విమర్శలు చేశారు.
YS Sharmila On CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ భూ బకాసురుడు అంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. అడిగేటోడు లేడని సర్కారీ భూములపై దొర ఇష్టారాజ్యం నడుస్తోందని విమర్శించారు. కావాల్సింది కాజేయడం.. ఆదాయం అని ఉన్నది అమ్మేయడం ఇదే రెండు దఫాలుగా కేసీఆర్ నడుపుతున్న భూముల దందా అని దుయ్యబపట్టారు. తనకు నచ్చిన రేటుకే కబ్జాలు చేస్తూ ప్రజలకు మాత్రం కాంపిటీషన్ పెడుతున్నారని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
జిల్లాల్లో పార్టీ ఆఫీసుల పేరిట రూ.వెయ్యి కోట్లు విలువ జేసే 33.72ఎకరాల భూములను రూ.3 కోట్లకే అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు వైఎస్ షర్మిల. "ఎకరం రూ.100 కోట్లు పలికే కోకాపేటలో దొర గారి భారతీయ భవన్ కోసం రూ.3.41 కోట్లకే 11ఎకరాలు దోచేశారు. దాదాపు రూ.1100 కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా పార్టీ ఆఫీసుకు లాక్కున్నారు. ప్రభుత్వ పనులకు పనికొచ్చే భూములన్నీ దొర గారి సొంత పార్టీ అవసరాలకు,ఆయన బినామిలకు ఉపయోగ పడుతున్నాయి. హైకోర్టు మొట్టికాయలు వేసినా, జనం దుమ్మెత్తిపోసినా తుడుచుకొనిపోతున్నాడు కానీ దొర గారిలో మార్పు రావడం లేదు" అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం రాయించుకున్న కోకాపేట భూములను వెంటనే ప్రభుత్వపరం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎకరం రూ.100 కోట్ల లెక్కన రూ.11వందల కోట్లను పార్టీ అకౌంట్ లో మూలుగుతున్న రూ.1200 కోట్ల నుంచి కట్టాలన్నారు.