హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్ లో కీలక వ్యక్తుల్ని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్న సమయంలో ఓ యువతి, డ్రగ్స్ కొరియర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుడి కుమార్తె...ఆమె కూడా స్వయంగా వైద్యురాలు. డాక్టర్ గా ఎంతో బాగా పని చేస్తూ డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అయితే ఇలాంటి డాక్టర్ డ్రగ్స్ కు బానిస అయ్యారు. కేవలం డ్రగ్స్ కోసమే ఇప్పటి వరకు రూ.70 లక్షలు ఖర్చు చేశారని పోలీసులు గుర్తించారు.
ముంబయిలోని ఓ పబ్ లో పరిచయమైన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకున్న ఆమె...డ్రగ్స్ కు బానిసగా మారిపోయింది. ఏడాదిలో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసినట్లు పోలీసులు అంటున్నారు. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో రూ. 5 లక్షల విలువైన డ్రగ్స్ ను ఆమె డెలివరీ తీసుకుంటోంది.
ఆమెను అరెస్టు చేసిన పోలీసులు...రిమాండ్ కు తరలించారు. కానీ ఆమె డ్రగ్స్ కు బానిస కావడంతో రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు.
వైద్యురాలు నమ్రత(34) హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపి, ముంబయి నుంచి డ్రగ్స్ ను ఆర్డర్ చేశారు. రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ ను లేడీ డాక్టర్ నమ్రత హైదరాబాద్ లో డెలివరీ తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 5 లక్షల విలువైన 53 గ్రాముల కొకైన్, రూ. 10 వేలు క్యాష్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలిగా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసై, ఇప్పటి వరకు రూ.70 లక్షల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యురాలై డ్రగ్స్ కు బానిస కావడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం