ం వీక్నెస్ ను క్యాష్ చేసుకుందామని ప్లాన్ వేసిన ముగ్గురు అన్నదమ్ములు...కాషాయం కట్టి మోసాలకు తెరలేపారు. ఆంజనేయస్వామి భక్తులమంటూ ఊళ్లలో తిరుగుతూ కానుకలు సేకరిస్తున్నారు. కానుకలు సేకరిస్తు్న్న క్రమంలో ప్రజల వ్యక్తిగత సమస్యలు పూజల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్కు చెందిన అన్నదమ్ములు కళ్లెం విజయ్, జీవన్ లాల్, కృష్ణలు ఈజీ మనీ కోసం కాషాయం కట్టి స్వాముల అవతారం ఎత్తారు. గ్రామాల్లో కానుకల సేకరణ పేరిట అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి వెళ్లిన ఈ ముగ్గురు హనుమాన్ భక్తులమని పరిచయం చేసుకుని ఇంటికి వెళ్లి కానుకలు సేకరించారు.
గ్రామంలోని ఓ కిరాణ దుకాణం నడుపుతున్న సతీష్, మహాలక్ష్మి దంపతులకు సంతానం లేరని తెలుసుకున్నారు. దీంతో ఓ ప్లాన్ ప్రకారం వాళ్ల ఇంటికి వెళ్లారు. మీకు సంతానం లేకపోవడానికి నరదృష్టి కారణమని, పూజలు చేస్తే సంతానం కలుగుతారని నమ్మించారు. బొట్టు పెట్టి తాయత్తు కట్టి రెండు వేల రూపాయలు వసూలు చేశారు.
చెట్ల పసరుతో సంతానం కలిగేలా చేస్తామని అందుకు రూ.19 వేలు ఖర్చవుతుందని దొంగ స్వాములు నమ్మించారు. మీ ఇంటి దగ్గరే పూజలు చేస్తామని నమ్మబలికి మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు. ఈ స్వాముల ప్రవర్తనపై అనుమానంతో సతీష్, మహాలక్ష్మి దంపతులు విషయాన్ని గ్రామంలోని మాజీ సర్పంచ్ కు చెప్పారు. దొంగ స్వాముల పనిపట్టేందుకు గ్రామస్థులు రివర్స్ ప్లాన్ వేశారు.
మరుసటి రోజు దొంగ స్వాములతో ఫోన్ మాట్లాడి పూజలు చేసేందుకు గ్రామానికి రావాలని, రూ.11 వేలకు బేరం కుదుర్చుకొన్నారు సతీష్, మహాలక్ష్మి దంపతులు. దీంతో ఫోన్ చేసిన అరగంటలోనే దొంగ స్వాములు గ్రామానికి వచ్చారు. గ్రామస్థులు వారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో వారు దొంగ స్వాములని, పూజల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు గుర్తించారు.
తాము స్టేషన్ ఘనపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కళ్లెం విజయ్, కళ్లెం జీవన్ లాల్, కళ్లెం కృష్ణ స్వాముల వేషాలతో తిరుగుతూ ప్రజల నుంచి కానుకలు సేకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో తిరుగుతూ కానుకల పేరుతో రూ.500, రూ.1000 చొప్పున వసూళ్లు చేస్తున్నట్లు స్వాములు ఒప్పుకున్నారు. ఇంకా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానంతో ముగ్గురిని నిర్బంధించారు.
ముగ్గురిని చికతబాది, గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగ బాబాలు, స్వాముల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సంబంధిత కథనం