ఈ నెల 23న బుధావం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లోని వైన్స్ షాపులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా వేరే ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని చెప్పారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ను మజ్లిస్ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఎన్.గౌతంరావు బరిలో ఉన్నారు బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్ణయించాయి. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.
ఈ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీచేయకుండా మజ్లిస్కు అండగా ఉంటున్నాయి. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటువేయకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోంది. ఇది ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే. ఎంఐఎం కోసం ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటేయలేదు. మతోన్మాద మజ్లిస్కు సపోర్ట్ చేస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యూలర్ పార్టీలు ఎలా అవుతాయి' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
సంబంధిత కథనం