హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి దారుణంగా హత్య చేసిన భార్య చివరకు పోలీసులకు దొరికిపోయింది.
హైదరాబాద్ కూకట్పల్లిలో కరెంట్ షాక్ భర్తను చంపిన భార్య ఉదంతం వెలుగు చూసింది. మెదక్ జిల్లా లింగాయపల్లెకు చెందిన కవిత-సాయిలు దంపతులకు పదిహేనేళ్ల క్రితం పెళ్లేంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి. కొన్నేళ్ళుగా దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. ఇటీవల సాయిలు తండ్రి చనిపోవడంతో భర్త వద్దకు వచ్చిన కవిత కలిసి ఉందమని చెప్పింది.
హైదరాబాద్ వెళ్లి పనులు చేసుకుందామని నమ్మించింది. లింగాయపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన దంపతులు కేపీహెచ్బీలో నిర్మాణంలో ఉన్న భవనంలో పనికి కుదిరారు. భార్యాభర్తలకు అనారోగ్య సమస్యలు ఉండటం, భర్త అనుమానంతో వేధిస్తుండటంతో భర్తను వదిలించుకోవాలని భావించిన కవిత చెల్లెలు భర్త సాయంతో సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది.
శవాన్ని మాయం చేసేందుకు ఈ నెల 18న ఆటోలో శవాన్ని మూటగట్టి శివారు ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించారు. వారి తీరుపై అనుమానంతో ఆటో డ్రైవర్ మధ్యలోనే వారిని దింపేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయిలు శవాన్ని ఓ ప్రాంతంలో పూడ్చి పెట్టిన కవిత సొంతూరు వెళ్లిపోయింది.
గ్రామంలో భర్త ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పడంతో అనుమానించిన బంధువులు కవిత తీరుపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. భర్త కనిపించక పోయినా కవిత కంగారు లేకపోవడంతో గట్టిగా నిలదీయడంతో హత్య విషయం వెలుగు చూసింది. లింగాయపల్లె సర్పంచ్ కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం వెలుగుచూసింది. నిందితురాలి అదుపులోకి తీసుకున్నారు. కవితకు సహకరించిన కవిత మరిది కోసం గాలిస్తున్నారు.
సంబంధిత కథనం