ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి తమ పార్టీ తరఫున కేంద్రానికి లేఖ రాయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ ఎందుకు ఈ డిమాండ్ చేశారనే చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం.
'ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో.. ఛత్తీస్గఢ్ గిరిజనులను ఊచకోత కోస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ప్రతిపాదన పెడుతున్నారు. ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్నా కోరుతున్నా.. బలమున్నది అని సంపుకుంట పోవుడు కాదు.. అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయండి' అని కేసీఆర్ కోరారు.
'నక్సలైట్లను పిలిచి డెమోక్రాటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్లు ఏం మాట్లాడుతారో చూడండి. అది కూడా నల్లనా.. తెల్లనా దేశం ముందుకు రానియండి. కానీ అట్ల కాదు మొత్తం ఏరిపారేస్తాం.. కోసిపారేస్తాం.. నరికిపారేస్తాం అంటే.. మంచిది కాదు. మిలటరీ మీ దగ్గరున్నది కొడుతరు. కానీ ప్రజస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట మీద ఢిల్లీకి ఉత్తరం పంపిద్దాం' అని కేసీఆర్ సభలో ప్రకటించారు.
ఇప్పుడే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 2012 మే 16న మాజీ నక్సలైట్ కొనపురి సాంబశివుడు టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) లో చేరారు. అప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ.. 'నక్సలైట్లు పేదలకు ఆహారం, నిరాశ్రయులకు ఇల్లు, బలహీన వర్గాలకు భూమి అందించడానికి పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి ఎజెండాను ఆమోదిస్తాం. ఆమోదించడమే కాదు.. అమలు చేస్తాం' కేసీఆర్ స్పష్టం చేశారు.
మరోవైపు పౌర హక్కుల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆపరేషన్ను ఆపేలా ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చలు జరిపారు. జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ కగార్.. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు నిర్వహిస్తున్న యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం మావోయిస్టులను నిర్మూలించడం. ఈ ఆపరేషన్లో కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్ అనేక వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా స్థానిక గిరిజనులపై దీని ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
సంబంధిత కథనం