KCR Directions : సూటిగా.. సుత్తి లేకుండా.. బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి?-what directions given by the kcr to brs leaders in latest meeting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Directions : సూటిగా.. సుత్తి లేకుండా.. బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి?

KCR Directions : సూటిగా.. సుత్తి లేకుండా.. బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి?

KCR Directions : ప్రస్తుతం తెలంగాణ రాజకీయం కేసీఆర్ చుట్టూ తిరుగుతోంది. అందుకు కారణం ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశం. అవును ఈ సమావేశంలో కేసీఆర్ కారు పార్టీ నేతలకు చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఇకనుంచి ఏం చేయాలో.. ఎలా ముందుకెళ్లాలో స్పష్టం చేశారు. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేసీఆర్

చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బయటకు వచ్చారు. రావడం రావడమే.. పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు వంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నాయకులకు పలు అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అలాగే.. రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పినట్టు తెలిసింది.

ఫిబ్రవరి 19న బుధవారం నాడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశం జరిగింది. రాత్రి 7 గంటల వరకు జరిగిన ఈ సమావేశానికి సంబంధించి.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేతతో 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ నేత కీలకమైన విషయాలు చెప్పారు.

మన లక్ష్యం అదే..

'ప్రజలు నమ్మి ఓట్లేస్తే.. కాంగ్రెస్ వారిని మోసం చేసింది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పుట్టిందే తెలంగాణ కోసం. కాబట్టి మన పార్టీ నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి. మన లక్ష్యం తెలంగాణ ప్రజల బాగుకోసం పనిచేయడమే. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎక్కడ మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కాంగ్రెస్, బీజేపీ చేసే రాజకీయాల గురించి మాట్లాడటం అనవసరం. ప్రజా సమస్యలపై స్పందించాలి' అని కేసీఆర్ సూచించినట్టు బీఆర్ఎస్ నేత వివరించారు.

కాంగ్రెస్‌కు దూరం.. బీజేపీకి దగ్గర..

'ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాహుల్ గాంధీకి దూరమయ్యారు. బీజేపీ నాయకులకు టచ్‌లోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు దించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చూస్తున్నారు. గతంలో వచ్చిన తీర్పులను పరిశీలిస్తే.. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో మనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావొచ్చు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. కాబట్టి.. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి' అని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సీనియర్ నేత చెప్పారు.

ప్రజలకు దగ్గరవ్వాలి..

'అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా రాజకీయ పరిణామాలు జరగొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు కీలకంగా మారబోతున్నాయి. పరిస్థితులను బట్టి మనం కూడా ప్రజలకు దగ్గరవ్వాలి. కార్యకర్తలను కాపాడుకోవాలి. సభ్యత్వ నమోదును అందరూ సీరియస్‌గా తీసుకొని పనిచేయాలి. బాధ్యతాయుతంగా కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించుకుందాం. ఇందులో అందరినీ భాగస్వామ్యం చేయాలి' అని కేసీఆర్ ఆదేశించినట్టు ఆ నేత చెప్పారు.

భవిష్యత్తు మనదే..

'ఎన్నికల్లో ఓడిపోయాం అని ఎవ్వరూ అధైర్యపడొద్దు. మళ్లీ అధికారం మనదే. అందరికీ న్యాయం చేస్తా. మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చామా అనే ప్రజల్లో జరుగుతోంది. ఎన్నికలకు చాలా సమయం ఉందని రిలాక్స్ కావొద్దు. పక్కా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్లో ఉండాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా ఉన్నాయనేది ప్రజలకు వివరించాలి. మళ్లీ కచ్చితంగా మనమే అధికారంలోకి వస్తాం' అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నేత చెప్పారు.