భూ భారతి పోర్టల్ సేవలు - ఛార్జీల వివరాలు ఎంతో తెలుసా..? ఇవిగో వివరాలు-what are the details of the fees prescribed for bhu bharati portal services ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  భూ భారతి పోర్టల్ సేవలు - ఛార్జీల వివరాలు ఎంతో తెలుసా..? ఇవిగో వివరాలు

భూ భారతి పోర్టల్ సేవలు - ఛార్జీల వివరాలు ఎంతో తెలుసా..? ఇవిగో వివరాలు

భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. మొదటగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమవుతాయి. అయితే ఈ పోర్టల్ ద్వారా లావాదేవీలకు సంబంధించి నిర్దేశించిన ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి…

భూ భారతి పోర్టల్

తెలంగాణ ప్రభుత్వం భూ భారతి చట్టం అమలును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీన పోర్టల్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రాగా… త్వరలోనే అన్ని మండలాల్లోనూ ప్రారంభిస్తారు.

గతంలో ధరణి పోర్టల్ లో ఉన్న ఇబ్బందులకు అవకాశం ఇవ్వకుండా….రైతుకు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా భూ భారతి పోర్టల్ ను తీసుకువచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అత్యంత సరళమైన భాషతో పాటు తక్కువ మాడ్యూల్స్ తో సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేస్తోంది.

భూ- భారతి చట్టం ప్రకారం….. ప్రతి భూకమతానికి భూ ఆధార్‌ రానుంది. ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థకు అవకాశం లేకపోగా…. భూ భారతిలో మాత్రం అవకాశం కల్పించారు. భూ స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ ప‌‌‌‌రిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవ‌‌‌‌స్థ ఉంటుంది.

మొదటగా ఎమ్మార్వోలు ఇచ్చే పట్టా పాసు పుస్తకాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డీవో కు వెళ్లొచ్చు. ఇక్కడ కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా…. కలెక్టర్‌ ఇచ్చే తీర్పుపై అభ్యంతరాలుంటే భూ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే వీలు ఉంటుంది. ఈ అప్పీళ్ల వ్యవస్థ ద్వారా… నేరుగా కోర్టుకు వెళ్లే పని ఉండదు. ధరణి ఉన్నప్పుడు అప్పీళ్ల వ్యవస్థ లేకపోవటంతో…. చాలా మంది కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది.

భూ భారతి పోర్టల్ సేవలు - నిర్దేశించిన ఫీజులు:

భూ భారతి పోర్టల్ ద్వారా పలు సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలను తెలుసుకునే సేవలు ప్రజలు పొందవచ్చు. అయితే ఇందులో కొన్నింటికి ప్రభుత్వం ఫీజులను నిర్దేశించింది. వాటి వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి….

  • భూ భారతి చట్టం ప్రకారం భూమి యజమాని రూ. 300 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసుపుస్తకం జారీ అవుతుంది.
  • భూ భారతి పోర్టల్ లో నిర్దేశించిన నమూనాలో మ్యూటేషన్ దరఖాస్తు కోసం ఎకరానికి రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం గుంటకు రూ. 62.50 ఛార్జీ పడుతుంది.
  • రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన స్టాంప్‌ డ్యూటీ ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏరియాను బట్టి మారుతుంది.
  • భూ యజమాని రికార్డుల్లో తప్పుల సవరణ దరఖాస్తు కోసం రూ. 1000 చెల్లించాలి.
  • భూ హక్కులతో పాటు అధికారుల సమర్పించిన రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే అప్పీల్ కు వెళ్లొచ్చు. ఇందుకోసం రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
  • స్లాట్ బుకింగ్ ద్వారానే భూ భారతి పోర్టల్ లోనూ రిజిస్ట్రేషన్లు అవుతాయి. అయితే అనుకున్న సమయానికి రాకపోతే మార్పులు చేసుకునే వీలు ఉంటుంది. మొదటిసారి ఉచితంగానే మార్పు చేసుకోవచ్చు. అదే రెండోసారి జరిగితే రూ. 500 చెల్లించాలి, ఇక మూడోసారి అయితే రూ. 1000 చెల్లించాలి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం