తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి...? 10 ముఖ్యమైన అంశాలు-what are the demands of telanagana govt employees know these key points ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి...? 10 ముఖ్యమైన అంశాలు

తెలంగాణ ఉద్యోగుల డిమాండ్లు ఏంటి...? 10 ముఖ్యమైన అంశాలు

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. జూన్ మాసంలో ప్రత్యక్ష ఆందోళన చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణలో ఉద్యోగుల డిమాండ్లు ఏంటి...?

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 50కి పైగా డిమాండ్లను ప్రస్తావిస్తూ… వేర్వురు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జూన్‌ మొదటి వారం తర్వాత ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి.

పెండింగ్ డీఏలు, ఈహెచ్‌ఎస్‌, ఫిట్‌మెంట్‌, పాత పెన్షన్ విధానం, 317జీవోపై సమీక్ష వంటి పలు సమస్యలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడిచినప్పటికీ… తమ సమస్యలపై మాత్రం దృష్టిపెట్టడం లేదని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం… వెంటనే తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు, ప్రభుత్వ వైఖరికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి…..

  • రాష్ట్ర ప్రభుత్వ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా ఉద్యోగ సంఘాలు అడుగులు వేస్తున్నాయి.
  • 2024 అక్టోబరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇందులో పలు సమస్యలను ప్రస్తావించారు. పెండింగ్‌ బిల్లులను విడుదల చేసేందుకు హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. ఇచ్చిన హామీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని వాపోతున్నారు.
  • ప్రతినెలా రూ.650 కోట్ల బకాయిలు చెల్లిస్తామంటూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని చెబుతున్నారు.
  • 5 డీఏ బకాయిల విడుదల కోసం ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. కనీసం కొన్నిడీఏలైనా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  • సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని ప్రధానంగా కోరుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
  • ఉద్యోగుల ఆరోగ్య రక్షణ పథకం(ఈహెచ్‌ఎస్‌) పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సేవలు అందేలా చూడాలని కోరుతున్నారు.
  • వేతన సవరణ కమిటీ నివేదిక సమర్పించటంతో పాటు 51 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.
  • సాధారణ బదిలీలను మే, జూన్‌ నెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 317జీవో అమలులో మిగిలిపోయిన సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  • ప్రధానంగా 57 డిమాండ్లను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.
  • ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీనియర్​ ఐఏఎస్​ అధికారులు లోకేశ్​ కుమార్ , కృష్ణభాస్కర్ కు చోటు కల్పించింది. ఇటీవలే ఈ కమిటీ… ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సమావేశమైంది. ఇందులో 57 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘ ప్రతినిధులు కమిటీకి అందజేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.