BRS in AP: విస్తరణపై అనుమానాలు! వ్యూహం ప్రకారమే జరుగుతోందా..?
బీఆర్ఎస్ విస్తరణ పై ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఏపీ నుంచి చేరికలు కూడా నడుస్తున్నాయి. కొందరు ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పేసుకున్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ టార్గెట్ విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కీలక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
BRS Expand in Andhrapradesh: బీఆర్ఎస్... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..! ఎవరూ ఊహించని విధంగా ఏపీకి చెందిన కొందరు గులాబీ కండువా కప్పుకున్నారు. సరిగ్గా ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కాస్త ఘాటుగానే స్పందించాయి. రాష్ట్రాని విభజనకు కారణమైన కేసీఆర్... ఏపీలో పార్టీని ఎలా విస్తరిస్తారని ప్రశ్నించాయి. ఇదిలా ఉంటే.. మరోవాదన తెరపైకి వస్తోంది. కేసీఆర్ - జగన్ వ్యూహాంలో భాగంగానే పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారనే వాదన ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ వ్యూహాంలో భాగంగానే ఏపీలో విస్తరణపై ఫోకస్ పెట్టారా..? సెంటిమెంట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా..? ఎన్నికలే టార్గెట్ గా పావులు కదిపేస్తున్నారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
రాజకీయ వ్యూహాలు రచించటంలో కేసీఆర్ దిట..! ఓ పావు కదిపారంటే... పక్కా ప్లాన్ ఉంటుంది. అలాంటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటించటం... అందులోనూ ఏపీపై ప్రధానంగా ఫోకస్ చేయటం మాత్రం అత్యంత ఆసక్తిని పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషస్తుందని భావిస్తున్న ఓ సామాజికవర్గానికి చెందిన పలువురిని పార్టీలోకి చేర్చుకోవటం అనేక చర్చలకు దారి తీస్తోంది. ఈ చేరికలపై కొందరు నేతలు సూటిగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆంధ్రాలో పవన్ ను, తెలంగాణలో బండి సంజయ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసీఆర్ - జగన్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందటమే లక్ష్యంగా ఇరు పార్టీల అధినేతలు ముందుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ బీజేపీ కూడా ఏపీ నేతలపై చేరికలపై స్పందించింది. సదరు నేతలను ఉద్దేశించి… బండి సంజయ్ ఘాటుగానే విమర్శించారు. మరో నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్లు(YS Jagan) కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఇరువురు సీఎంలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విభజన సమస్యలపై కేంద్ర మీటింగ్కు.. ఏపీ వాళ్ళు హాజరైతే, తెలంగాణ వాళ్ళు వెళ్లడం లేదని, తెలంగాణ వాళ్ళు వెళ్తే.. ఏపీ వాళ్ళు వెళ్లట్లేదన్నారు. అవగాహనలో భాగంగానే ఇదంతా జరుగుతోందని… మరోసారి సెంటిమెంట్ ను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఏపీ నేతల చేరికల వెనుక వైసీపీ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నిజానికి ప్రస్తుతం ఏపీలో పార్టీల మధ్య పొత్తుల రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీ,జనసేన మధ్య అవగాహన ఉన్నా, ఎన్నికల నాటికి జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు ప్రధానంగా కాపు ఓటు బ్యాంకు మీదే ఆశలన్నీ పెట్టుకున్నాయి. జనసేనతో జట్టు కట్టడం ద్వాారా కొన్ని స్థానాల్లో అయినా గెలవాలని బీజేపీ భావిస్తున్నా, టీడీపీతో పొత్తుకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఏపీలోకి రావటం… కొందరు నేతలు ఆ పార్టీలో చేరటంతో ఆంధ్రా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే పక్కాగా వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఫలితంగా కేసీఆర్ కు వచ్చే లాభమేంటన్న చర్చ కూడా ఓ కోణంలో వినిపిస్తోంది. అయితే వ్యూహం లేకుండా ఏ పని చేయని కేసీఆర్.. ఓ అడుగు ముందుకేస్తున్నారంటే… పక్కాగా కారణాలు ఉండే ఉంటాయన్న వాదన బలంగా తెరపైకి వస్తోంది.