Telangana Rains: భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లో వాన దంచికొడుతుండగా… ఏపీలోని పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మరోవవైపు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Rains in AP and Telangana:ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా రుతుపవనాల ద్రోణి ఏర్పడింది. దీంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. తెలంగాణలో శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఎల్లో అలర్ట్….
ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురుస్తాయనిపేర్కొంది.
హైదరాబాద్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నగరంలో కొన్నిసార్లు వేగవంతమైన జల్లులు కూడా పడుతాయని తెలిపింది. ఉత్తర/ ఈశాన్య దిశ నుంచి గాలులు(గాలి వేగం 06 -08 కి.మీ) వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరో వారం రోజుల్లో తెలంగాణ నుంచి పూర్తిగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 18న ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.
పెరిగిన కృష్ణా వరద ఉద్ధృతి….
Rains in Andhrapradesh : ఏపీలోనూ మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారురు. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4.07 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ముంపు ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884 అడుగులుగా ఉంది.