తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు నాలుగు రోజులు మరిన్ని వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోనూ వానలు పడనున్నాయి.
సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబునగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంది.
బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం అక్టోబర్ 6 రోజున ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో భారీ వర్షం పడనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షం కురవనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.