Wardhannapet Constituency : రాష్ట్రంలో రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుపొందిన ఆ ఎమ్మెల్యే.. హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి రేసులో ఉండాలనుకున్నారు. చెప్పుకోదగ్గ ప్రత్యర్థులెవరూ లేరనే ఉద్దేశంతో ఈసారి గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు. కానీ నియోజకవర్గంలో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల వేళ ఆయన ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు ఎదురవుతున్నాయి. లోకల్ నాయకుల తీరు, జనాల తిరుగుబాటు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా? ఆయనే వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేశ్.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు తరువాత అత్యంత భారీ మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. 2014 ఎన్నికల్లో రమేశ్.. అప్పటి సిట్టింగ్ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కొండేటి శ్రీధర్పై దాదాపు 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ జన సమితి నేత పగిడిపాటి దేవయ్య పై 99 వేలకు పైగా మెజారిటీ పొందారు. సుమారు లక్షా 20 వేల మెజారిటీ సాధించిన మంత్రి హరీశ్ రావు తరువాత అత్యధిక ఓట్లు పొందిన ఎమ్మెల్యేగా అరూరి రమేశ్కు పేరుంది. గత రెండు ఎన్నికలను బేరీజు వేసుకుని ఆయన 2023 ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు.
నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆరాటపడుతున్నారు. మూడోసారి ఘన విజయం సాధిస్తే.. మంత్రి పదవి రేసులో ఉండొచ్చని ఆశపడుతున్నారు. గత ఎన్నికల్లోనే భారీ మెజారిటీ రావడంతో ఆ సమయంలో మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ వివిధ సమీకరణాల వల్ల ఆ కల నెరవేరలేదు. ఈసారి బంపర్ మెజారిటీతో గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి డిమాండ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అనుకున్న మెజారిటీ వస్తుందా లేదా అని సర్వేలు నిర్వహించి, పార్టీ నేతలు, కార్యకర్తలకు తరచూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఎమ్మెల్యే అరూరి రమేశ్ భారీ మెజారిటీ ఆశిస్తుండగా.. నియోజకవర్గంలో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, ఐనవోలు, పర్వతగిరి, హసన్పర్తి, హనుమకొండ మండలాలు ఉండగా.. అంతటా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ సిటీ పరిధిలోనే వర్ధన్నపేటకు చెందిన దాదాపు 30 విలీన గ్రామాలు ఉండగా.. వాటి అభివృద్ధిని ఎమ్మెల్యే పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతోనే ఎన్నికల వేళ ఆయన ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ నిరసనలే ఎదురవుతున్నాయి. ఇటీవల ఐనవోలు మండల పర్యటనకు వెళ్లగా.. కొండపర్తి, వనమాల కనపర్తి, తదితర గ్రామాల ప్రజలు ఆయనను అడ్డుకున్నారు. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట, నల్లబెల్లి, హసన్పర్తి మండలం పెంబర్తి, జయగిరి తదితర గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
తాజాగా సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు జయగిరి గ్రామానికి వెళ్లగా.. అక్కడి ప్రజలు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలు పార్టీ నేతలకే పరమితం చేయడం, గ్రామాల్లో లీడర్ల వ్యవహారశైలితో చాలామంది యూత్ పార్టీకి దూరం అవుతున్నారు. అభివృద్ధి కనిపించకపోవడం, ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొనడంతో యూత్ చాలావరకు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఎమ్మెల్యే అరూరి రమేశ్ టెన్షన్లో పడినట్లు తెలుస్తోంది. దీంతోనే యూత్ ను మచ్చిక చేసుకోవాలని, ఎలాగైనా యూత్ను బీఆర్ఎస్ వైపు మళ్లించాలని సూచించడంతో గ్రామాల్లో లీడర్లు యూత్తో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సెంటిమెంట్తో అరూరి రమేశ్కు భారీ మెజారిటీ రావడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేశారు. జనాలు కూడా రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమందిని మాత్రమే పట్టించుకుంటూ మిగతా క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపునకు ముందు ఆయనపై అసమ్మతి రాజేసిన కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు.. అరూరికి టికెట్ఇవ్వొద్దని పార్టీ పెద్దలకు వినతిపత్రాలు ఇవ్వడం కూడా క్యాడర్లో అసంతృప్తిని స్పష్టం చేస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేకు అతిసన్నిహితులుగా చెప్పుకొనే ఓ పీఎసీఎస్చైర్మన్, ఓ మాజీ కార్పొరేటర్, జిల్లాకు చెందిన మరో ముగ్గురు కీలక నేతలు అరూరిపై వ్యతిరేకతతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతోనే ఎమ్మెల్యే అరూరికి గెలుపు టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రామస్థాయిలో పట్టుండటంతో ఎమ్మెల్యే మదనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ కూడా పుంజుకున్నాయి. కాగా ఆ రెండు పార్టీల నుంచి బరిలో దిగే నేతలను ఎమ్మెల్యే అరూరి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.