Ex MP Sircilla Rajaiah | మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలి మృతి కేసు.. 2015 నుంచి ఇప్పటి వరకూ ఏం జరిగింది?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలి మృతి కేసుపై కోర్టు తీర్పు వెల్లడించింది. సిరిసిల్ల రాజయ్యపై నమోదైన కేసును కొట్టివేసింది.
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలుతోపాటు ఆమె పిల్లలు కూడా గతంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు.. మాజీ ఎంపీ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాజాగా వరంగల్ జిల్లా కోర్టు ఈ కేసుపై తీర్పు వెలువడించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనీల్, రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడో నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై గతంలో కేసు నమోదైంది. ఈరోజు వరంగల్ జిల్లా కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చింది.
ట్రెండింగ్ వార్తలు
2015 నవంబర్ లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మాజీ ఎంపీ నివాసంలోనే చనిపోయారు. పొద్దుపొద్దున్నే.. జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును పోలీసులు అనుమానస్పద మృతిగా నమోదు చేశారు. విచారణ చేశారు.
ఈ కేసులో ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో టీం సైతం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే.. సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రెండు రోజులపాటు విచారణ చేశారు. అయితే అదే సమయంలో వరంగల్ ఉపఎన్నిక ఉండేది. ఈ కేసు కారణంగా.. రాజయ్య ఉపఎన్నిక బరి నుంచి తప్పుకున్నారు.
రాజయ్య, మాధవి దంపతుల కుమారుడు.. అనీల్ సారిక ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల అడ్డుచెబుతారనే ఉద్దేశంతో.. హైదారాబాద్ లోని మారేడుమిల్లిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2003లో చదువు కోసం అనిల్ లండన్ వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు సారిక కూడా లండన్కు వెళ్లింది. 2005లో వీరి పెళ్లి గురించి తెలిసి.. మళ్లీ.. యాదగిరి గుట్టలో వివాహం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు గొడవలు మెుదలయ్యాయి.
అయితే అనీల్ కొన్ని రోజులకు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి రాజయ్య కుటుంబ సభ్యులు, సారిక మధ్య గొడవలు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే.. పిల్లలతోపాటుగా.. సారిక మృతి చెందింది. అయితే గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే చర్చ అప్పట్లో బాగా నడిచింది. తాజాగా రాజయ్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులను కోర్టు నిర్దోషులుగా గుర్తించింది.
టాపిక్