బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు - కొరడా ఝుళిపిస్తున్న ఓరుగల్లు పోలీసులు-warangal cp warns of cases being registered if alcohol is consumed in public places ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు - కొరడా ఝుళిపిస్తున్న ఓరుగల్లు పోలీసులు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు - కొరడా ఝుళిపిస్తున్న ఓరుగల్లు పోలీసులు

HT Telugu Desk HT Telugu

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేసులు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం దాటితే చాలు…. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు - వరంగల్ సీపీ వార్నింగ్

వరంగల్ నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ కొంతమంది న్యూసెన్స్ చేస్తున్నారు. రోడ్లపైనే తీరిగ్గా మందు బాటిల్ ఓపెన్ చేసి, దర్జాగా లాగించేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లగా.. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వ్యక్తులపై సీరియస్ గా వ్యవహరించాల్సిందిగా పోలీస్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు.

సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు…

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది జనావాసాలు, ఓపెన్ ప్లేసుల్లో మద్యం తాగే వ్యక్తులపై కొరడా ఝుళిపిస్తున్నారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో సాయంత్రం అయ్యిందంటే సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది రోడ్డెక్కుతున్నారు. వైన్స్ షాపుల సమీపంలోగానీ, ఇతర బహిరంగ ప్రదేశాల్లో గానీ మద్యం తాగుతున్న వారిని పట్టుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ సిటీ పోలీస్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు.

మూడు రోజుల్లో 300కుపైగా కేసులు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న మందు బాబులపై చర్యలకు ఉపక్రమించిన వరంగల్ పోలీసులు ఈ నెల 7వ తేదీ నుంచి స్పెషల్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైన్స్ షాపుల పరిసరాలతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ మందు బాబులను పట్టుకుంటున్నారు.

ఈ నెల 7న ఈ స్పెషల్ రైడ్స్ స్టార్ట్ చేయగా.. మొదటి రోజే కమిషనరేట్ పరిధిలో మొత్తంగా 221 మందిపై కేసులు నమోదు చేశారు. సిటీ పోలీస్ యాక్ట్ కింద ఈ కేసులు నమోదు చేయగా.. మొదటి రోజు అత్యధికంగా జనగామ డివిజన్ పరిధిలో 57 కేసులు, హనుమకొండ డివిజన్ పరిధిలో 42, స్టేషన్ ఘన్ పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ లో 10 చొప్పున కేసులు నమోదు చేశారు. ఆ తరువాత 9వ తేదీన మరో వంద మందిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ జనాలను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు.

మిశ్రమ స్పందన…

వరంగల్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తుండగా, దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. బహిరంగంగా మద్యం తాగడం, మందు బాబుల న్యూసెన్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న జనాలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరో వైపు అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్న వారిలో మందుబాబుల కంటే అడ్డా మీద కూలీ పనులకు వెళ్లే కార్మికులే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో రోజూ కూలీ చేసుకునే లేబర్ పై ప్రతాపం చూపుతున్నారంటూ వరంగల్ జనాల్లో చర్చ నడుస్తోంది.

షాపు ఓనర్లపై చర్యలుండవా..?

ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తుండగా, వైన్స్ పర్మిట్ రూంలలోనే మద్యం తాగేలా చర్యలు తీసుకువాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ కూలీలు పట్టుబడితే ముందుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని, అయినా మార్పు రాకపోతే యాక్షన్ తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. వైన్స్ షాపుల సమీపంలో మందు తాగితే.. సంబంధిత మద్యం దుకాణదారులపై యాక్షన్ తీసుకోవాల్సిందిపోయి.. లేబర్ ను కేసుల పేరున ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో వరంగల్ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).