దృశ్యం సినిమాను తలపించేలా సాయి ప్రకాశ్ హత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వరంగల్ సీపీ-warangal cp revealed shocking issues behind social activist murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దృశ్యం సినిమాను తలపించేలా సాయి ప్రకాశ్ హత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వరంగల్ సీపీ

దృశ్యం సినిమాను తలపించేలా సాయి ప్రకాశ్ హత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వరంగల్ సీపీ

HT Telugu Desk HT Telugu

వరంగల్ లో ఇటీవల హత్యకు గురైన చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాశ్ హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. తనకు పిన్ని వరుస అయ్యే ఓ మహిళతో ఓ కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకోగా.. ఆవిషయాన్ని బయటపెట్టి, తనను సస్పెండ్ చేయించాడనే కారణంతో సదరు కానిస్టేబుల్.. సాయి ప్రకాశ్ ను హత్య చేయించాడు.

వివాహేతర సంబంధాన్ని బయటపెట్టినందుకు సోషల్ యాక్టివిస్ట్ హత్య

వరంగల్‌లో చేయూత స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకుడు సాయి ప్రకాశ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హత్య అనంతరం పోలీసులకు చిక్కకుండా నిందితులు దృశ్యం సినిమాను తలపించేలా స్కెచ్ వేశారు. అయినా పోలీసులు కేసును చేధించి, ఆరుగురిని అరెస్ట్ చేశారు. సాయి ప్రకాశ్ హత్య, అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం సాయంత్రం వెల్లడించారు.

భూవివాదంలో మహిళ పరిచయం

హనుమకొండ జిల్లా చింతగట్టుకు చెందిన భాషబోయిన శ్రీనివాస్ 2009లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ కు వచ్చాడు. ఇక్కడ హనుమకొండ పీఎస్ లో క్రైమ్, కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు.

ఆ తరువాత 317 జీవో బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ ను ములుగు జిల్లా వెంకటాపురం స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. కాగా అక్కడ పని చేస్తున్న సమయంలో ఓ భూవివాదంలో వెంకటాపురం గ్రామానికి చెందిన చిట్టెం నిర్మల అనే మహిళ స్టేషన్ కు వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.

సస్పెండ్ చేయించాడని కోపం

చిట్టెం నిర్మల, కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్రమ సంబంధం విషయం బయటకు తెలియడంతో ఆమె భర్త తనకు వరుసకు కొడుకు అయ్యే సాయి ప్రకాశ్ అనే యువకుడికి చెప్పాడు. సాయి ప్రకాశ్ స్థానికంగా చేయూత అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉంది. తన పిన్ని అయిన నిర్మల వ్యవహారాన్ని ఆమె భర్త సాయి ప్రకాశ్ కు చెప్పడంతో ఆయన విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

దీంతో వాళ్లు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలం పూర్తి కావడంతో గతేడాది డిసెంబర్ లో మళ్లీ విధుల్లో చేరాడు. తమ అక్రమ సంబంధాన్ని బయట పెట్టడంతో పాటు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారని రగిలిపోయిన నిర్మల, శ్రీనివాస్ ఇద్దరూ సాయి ప్రకాశ్ పై కోపం పెంచుకున్నారు.

హత్యకు పక్కా ప్లాన్

సాయి ప్రకాశ్ అడ్డుతొలగించుకునేందుకు ఆయన పిన్ని నిర్మల, కానిస్టేబుల్ శ్రీనివాస్ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న నిర్మల తన మామయ్యకు ఆరోగ్యం బాలేకపోవడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిందిగా సాయి ప్రకాశ్ ను కోరింది. దీంతో సాయి ప్రకాశ్ తన కారులో పేషెంట్ తో పాటు నిర్మల, ఆమె భర్తను హనుమకొండలోని ఆసుపత్రికి తీసుకొచ్చి తిరుగు ప్రయాణమయ్యాడు.

అప్పటికే అర్ధరాత్రి అవుతుండటంతో గోపాలపూర్ లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు కారులో బయలు దేరాడు. కాగా సాయి ప్రకాశ్ హాస్పిటల్ కు వచ్చిన సమయంలోనే నిర్మల తన ప్రియుడు శ్రీనివాస్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అప్పటికే టైం కోసం వేచి చూస్తున్న శ్రీనివాస్ తన స్నేహితులైన డెవిలే సాయి, అలోతు అరుణ్ కుమార్, సబావత్ అఖిల్ నాయక్, రాజును రప్పించుకున్నాడు.

దీంతో వారు హాస్పిటల్ నుంచి వెళ్తున్న సాయి ప్రకాశ్ కారును ఆటోలో వెంబడించి, గోపాలపూర్ శివారులో అడ్డగించారు. అనంతరం అతడిపై దాడి చేసి, కారును హసన్ పర్తి శివారుకు తీసుకెళ్లి శాలువాతో ఉరి బిగించి చంపేశారు.

ఎంక్వైరీకి చిక్కకుండా ‘దృశ్యం’ ప్లాన్

సాయి ప్రకాశ్ ను హత్య చేసిన అనంతరం పోలీసులకు చిక్కకుండా శ్రీనివాస్ దృశ్యం సినిమాను తలపించేలా పక్కా ప్లాన్ అమలు చేశాడు. అంతా కలిసి డెడ్ బాడీ అదే కారులో సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ శివారు జిల్లెల గడ్డ తండా వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ సాయి ప్రకాశ్ డెడ్ బాడీకి దుస్తులు మార్చేసి, ఇదివరకు ఉన్న రక్తపు మరకలు ఉన్న దుస్తులను కాల్చేశారు. అనంతరం అదే కారులో కాజీపేట రైల్వే స్టేషన్ కు వెళ్లి సెల్ ఫోన్ ను ఓ ట్రైన్ పడేశారు. కారును హనుమకొండకు తీసుకుని వచ్చి వదిలేశారు. కారు ఒక జిల్లాలో, డెడ్ బాడీ ఇంకో జిల్లాలో, సెల్ ఫోన్ మరో జిల్లాలో ఉండగా, దర్యాప్తు ముందుకు జరిగే అవకాశం ఉండదని భావించారు.

15వ తేదీన వెళ్లిన సాయి ప్రకాశ్ ఎంతకూ ఇంటికి చేరకపోవడంతో 18వ తేదీన ఆయన తమ్ముడు సాయితేజ హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని ప్రకారం దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాయి ప్రకాశ్ కారును ఓ ఆటో ఫాలో అవుతున్నట్లు గుర్తించి, ఆటో డ్రైవర్ డెవిలె సాయి ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

అనంతరం సాయి ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనివాస్, అరుణ్ కుమార్, అఖిల్ నాయక్, రాజుతో పాటు హత్యకు కారణమైన నిర్మలను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, రెండు ఆటోలు, రెండు బైకులు, ఒక ఎయిర్ పిస్టల్, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా సమాజ సేవలో ముందుండే సాయి ప్రకాశ్ హత్యతో ములుగు జిల్లా వెంకటాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం