TS Govt On VRO System: VRO వ్యవస్థ రద్దు విధాన నిర్ణయం..ఆ అధికారం తమకు ఉందన్న సర్కార్
TS High Court News Updates: రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు సంబంధించిన అంశంప తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వం. వీఆర్వో వ్యవస్థ రద్దు విధాన నిర్ణయం తెలిపింది.
VRO System Abolished in Telangana: రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయడంతో వీఆర్వో వ్యవస్థతో పనిలేకుండా పోయిందని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. వీఆర్వో చట్టాన్ని రద్దుచేస్తూ వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు గల కారణాలతో పాటు బదిలీల అంశానికి సంబంధించిన వివరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ట్రెండింగ్ వార్తలు
వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం విధాన నిర్ణయమని ఏజీ చెప్పారు. వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్నిసవాల్ చేసే హక్కు ఉద్యోగికి లేదని పేర్కొన్నారు. వీఆర్వోల వేతనం, స్థాయికి తగ్గకుండా వారిని ఇతర శాఖల్లో నియమించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని వీఆర్వోలు ఆమోదించారని...కేవలం 60 మంది మాత్రమే విధుల్లో చేరలేదని వివరించారు. రెవెన్యూ శాఖలోని పోస్టుల్లోనే చేరాలని కోరుకునే హకు వీఆర్వోలకు లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను 2020 సెప్టెంబర్ లో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా 7,039 వీఆర్వో పోస్టులు రద్దయ్యాయి. రెవెన్యూ సిబ్బందికి అధికారాల తగ్గింపు, హోదాల మార్పు, కొత్త విభాగాల కూర్పుతో ఈ చట్టానికి సర్కారు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగానే వీఆర్వో వ్యవస్థ(VRO System)ను రద్దు చేసింది. వీఆర్వోల వద్ద ఉన్న రికార్డులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతుల నుంచి వీఆర్వోలు పెద్దఎత్తున లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. రెవెన్యూ రికార్డుల తారుమారుకు కూడా వీఆర్వోలే ప్రధాన బాధ్యులని ప్రభుత్వం భావించింది. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే వీఆర్వో వ్యవస్థ ఉండరాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని రద్దు చేశారు. అయితే సర్కార్ నిర్ణయంపై వీఆర్వోలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ... చివరికి వెనక్కి తగ్గారు. అయితే ఇప్పటికే పలు శాఖల్లోకి వారిని సర్దుబాటు చేసింది ప్రభుత్వం. అయితే పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.