వేములవాడ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పేరుతో జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు(బుధవారం) వేములవాడ పట్టణ బంద్ కు రాజన్న ఆలయ రక్షక కమిటీ పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తమ దుకాణాలను మూసివేయాలని కోరింది.
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామక్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీల నాయకులతో కలిసి ‘రాజన్న ఆలయ రక్షక కమిటీ’ని ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా రాబోయే రెండు సంవత్సరాలపాటు ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న ఆలయ రక్షక కమిటీ నిరసనకు పిలుపునిచ్చింది.
కమిటీ ఛైర్మన్ ప్రతాప రామక్రిష్ణ మాట్లాడుతూ....ఆలయ అభివృద్ధి పేరుతో 2 ఏళ్లపాటు రాజన్న ఆలయాన్ని మూసివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో పరివార్ దేవతామూర్తుల (హిందూ) విగ్రహాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
రాజన్న ఆలయం వద్దనున్న దర్గాను తొలగించాలని రాజన్న భక్తులంతా ముక్త కంఠంతో కోరుతున్నా పట్టించుకోని అధికారులు ఆలయాన్ని మూసివేయాలనుకోవడం విడ్డూరమన్నారు. సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు చేపట్టబోయే వేములవాడ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేయాలని పిలుపునిచ్చారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం జూన్ 15 నుంచి మూసివేస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆలయ ఈవో కె.వినోద్ అన్నారు. ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన పూర్తి వివరాలు, భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
రాజన్న ఆలయం మూసివేస్తున్నట్లు వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని, ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని అన్నారు.
శృంగేరి పీఠాధిపతి అనుమతులు, దేవాదాయ ధర్మదాయ శాఖ సలహాలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆలయాన్ని సుందరింగా తీర్చి దిద్దుతామన్నారు.
రాజన్న ఆలయ నిర్మాణ పనులు, విధి విధానాలు, పూర్తి అంశాలను తదుపరి సమావేశంలో వెల్లడిస్తామని ఈవో తెలిపారు. ఇప్పటివరకు భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వదంతులను నమ్మవద్దని కోరారు.
సంబంధిత కథనం