Hyderabad : నాంపల్లిలో దారుణం.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.. భక్తుల ఆగ్రహం
Hyderabad : హైదరాబాద్ నాంపల్లిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులను శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు.. విచారణ చేపట్టారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతిష్టిస్తారు.
గురువారం రాత్రి దాండియా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అందరూ ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత దుండగులు విగ్రహం నెలకొల్పిన దగ్గరకు వచ్చారు. మొదటగా కరెంట్ను కట్ చేశారు. ఆ తర్వాత సీసీ కెమెరాలు విరగగొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగ్గొట్టారు. పూజా సామాన్లను పడేశారు. అమ్మవారి చుట్టూ ఉన్న బారికేడ్లను విరగ్గొట్టారు.
అయితే.. గురువారం రాత్రి దాండియా కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసులు అక్కడే ఉన్నా.. దుండగులు ఎలా వచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి.. బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ప్రతీ సంవత్సరం ఎక్కడో ఒక వద్ద హిందు ఆరాధ్య విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 27న కూడా పాతబస్తీలో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు భూలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అక్కడి పూజా సామాగ్రి, పీట, ఇతర వస్తువులను చిందర వందర చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మవారి విగ్రహంపైన ఉండే కిరీటం కిందపడి ఉండటం, అక్కడే రాళ్లు పడి ఉండటం ఈ వీడియోల్లో స్పష్టంగా రికార్డయింది.