అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీసం మంత్రులకైనా ఆదేశాలివ్వాలని కోరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటున్నారని ఆరోపించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, పెద్దపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. దారుస్సలాంలో మజ్లిస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్త, కర్మ, క్రియగా మారి ఆర్థిక సాయం చేసి నిర్వహించిన సభ అని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను కాజేసి ముస్లింల పొట్టకొట్టిన బడా చోర్లంతా కలిసి మీటింగ్ కు హాజరై ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విష సర్పాలు ఎంతటి ప్రమాదకరమో ముస్లింలపట్ల ప్రేమగా నటిస్తూ వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటూ ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన మజ్లిస్ నేతలు అంతకంటే డేంజర్ అన్నారు.
అంబేడ్కర్ పెట్టిన భిక్షవల్లే ప్రధాని కాగలిగానని నిండు పార్లమెంట్ లో ప్రకటించిన మహానేత నరేంద్రమోదీ తెలిపారని బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను, ఆశయాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని, అణగారిన వర్గాల జీవితాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాడని తెలిపారు. ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు పంచ్ తీర్థలను ఏర్పాటు చేసిన మహనీయుడు మోడీ అని కొనియాడారు. అంబేద్కర్ కు అసలు సిసలైన వారసుడు మోదీగారేనని స్పష్టం చేశారు. ఏటా లక్షా 25 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న మహానేత... అంబేద్కర్ స్పూర్తితో దళిత, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన గొప్ప పార్టీ బీజేపీ అని, అంబేడ్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఒవైసీకి లేదన్నారు.
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న నాయకులు వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్నుండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని అన్యక్రాంతం అయ్యాయో చెప్పగలరా అని బండి సంజయ్ ప్రశ్నించారు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ) నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్ ఆస్తులున్నాయని, వాటి విలువ 10 లక్షల కోట్ల రూపాయలకు పైమాటేనని తెలిపారు వక్ఫ్ ఆస్తుల్లో సగానికిపైగా కొల్లగొట్టింది వక్ఫ్ బోర్డు ముసుగులో పెత్తనం చెలాయిస్తున్న వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులపై ఏటా 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంటే... ఆ సొమ్మునంతా దిగమింగుతోంది మీరు కాదా? అని ప్రశ్నించారు.
"తమిళనాడులోని 15 వందల ఏళ్ల నాటి పురాతన చంద్రశేఖర ఆలయ భూములను కూడా వక్ఫ్ భూములను పేర్కొంటూ క్లెయిమ్ చేసుకుంది నిజం కాదా? హర్యానాలోని గురుద్వారా భూమిని ఆక్రమించుకుంది వాస్తవం కాదా? కర్నాటక లింగాయత్ ల వ్యవసాయ భూమిని, కేరళలలోని క్రైస్తవ మత్స్యకారుల భూములను కూడా వక్ఫ్ భూములని క్లెయిమ్ చేసుకుంది నిజం కాదా?తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ లాండ్స్ ఉంటే... అందులో 80 శాతం భూములు ఈ దొంగలే స్వాధీనం చేసుకుంది నిజం కాదా? ఒవైసీ కుటుంబంతోపాటు మజ్లిస్ నాయకులు, సోకాల్డ్ వక్ఫ్ బోర్డు సభ్యులంతా వక్ఫ్ ఆస్తులను దోచుకుని ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు నిర్మించి కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ 77వేల ఎకరాల్లో ఒక్క గజం అయినా పేద ముస్లింలకు ఇచ్చారా?
వక్ఫ్ ఆస్తులపై వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి అయినా పేద ముస్లింలకు ఖర్చు చేశారా? ఏ ఒక్క పేద ముస్లిం జీవితాన్నైనా బాగు చేశారా? కనీసం పాతబస్తీలో మురికి కూపాల్లో బతుకుతున్న ముస్లింలకు గజం జాగా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు బండి సంజయ్. 5లక్షల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తుల్లో పేద ముస్లింలకు కేటాయించిందెంత? ఆ ఆస్తులపై వచ్చే ఆదాయంలో వాళ్ల కోసం ఖర్చు చేసిందెంత? అసలు ఆ సొమ్మంతా ఎటు పోతోంది? ఎవరి ఆధీనంలో ఎన్ని వక్ఫ్ ఆస్తులున్నాయో బహిరంగ చర్చకు సిద్ధమా?" అని సవాల్ విసిరారు.
"మేం వాస్తవాలు మాట్లాడుతుంటే వక్ఫ్ ఆస్తుల్లో హిందువుల జోక్యమా? అంటూ అడ్డగోలుగా మాట్లాడతరా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు పేరుతో ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? వక్ఫ్ ఆస్తులను కాజేసినా, వక్ఫ్ పేరుతో హిందువుల, క్రిస్టియన్ల, సిక్కుల భూములను, ప్రార్ధనా మందిరాల భూములను ఆక్రమించుకుంటే ఊరుకోవాలా? అన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపించే దమ్ముందా? ఎన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి? ఎవరు ఆక్రమించారు? అందులో ఒవైసీ! కుటుంబం ఎంత దోచుకుంది? వక్ఫ్ ఆస్తులపై ఏటా ఎంత ఆదాయం వస్తోంది?
ఆ సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు? పేదల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయి రైతులంతా అల్లాడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వ హయాంలో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వలే" ఈ ప్రభుత్వం అదే పంథా కొనసాగిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇకనైనా వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం మంత్రులకు ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్ఢి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.