South Central railway : వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్.. కేంద్రమంత్రి అంగీకారం!-union minister approves construction of railway line around warangal orr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  South Central Railway : వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్.. కేంద్రమంత్రి అంగీకారం!

South Central railway : వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్.. కేంద్రమంత్రి అంగీకారం!

South Central railway : కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ గురించి చర్చించారు. దీనికి కేంద్రమంత్రి అంగీకారం తెలిపినట్టు మంత్రులు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్రమంత్రితో తెలంగాణ నేతలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్రమంత్రితో సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంపై చర్చించామని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే జంక్షన్‌ అంశాలపై మంత్రి సానుకూలంగా మాట్లాడారని చెప్పారు.

ఔటర్ చుట్టూ..

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ వేయడానికి రైల్వే మంత్రి అంగీకారం తెలిపారని.. కోమటిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజకీయాలు పక్కన పెట్టి.. అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు.

వరంగల్ అభివృద్ధికి..

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద మహానగరం వరంగల్ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. వరంగల్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం శుభసూచకమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

కలిసి రావాలి..

'రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. ఇప్పటికైనా మాతో కలసిరావాలి. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి అనేక విషయాలపై చర్చిస్తాం' అని కొండా సురేఖ స్పష్టం చేశారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామాల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రమంత్రిని కలిశారు. ఈ సమావేశం తర్వాత అశ్విని వైష్ణవ్ మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లారు.

వరంగల్ ఓఆర్ఆర్ గురించి..

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ నిర్మిస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ వే. ఈ ఔటర్ రింగ్ రోడ్డు 69 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రతి 20 కిలోమీటర్లకు సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్-వరంగల్ దారిలో రాంపూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, కోమటిపల్లి, భీమారం, చింతగట్టు, పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి, వంగపహాడ్, ఆరేపల్లి వరకు ఉంటుంది.

2017లో శంకుస్థాపన..

ఈ ఎక్స్ ప్రెస్ వే కి అక్టోబర్ 2017లో అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ 69 కిలోమీటర్ల పొడవైన రహదారిని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరంగల్ చుట్టూ 41 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి.

మూడు దశల్లో..

ఈ ఔటర్ రింగు రోడ్డును మూడు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో 20 కిలోమీటర్లు, రెండవ దశలో 11 కిలోమీటర్లు, మూడవ దశలో 10 కిలోమీటర్లు నిర్మించనున్నారు. గత జూన్ లో వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.