Cable Bridge On Krishna River :మరో ముందడుగు.. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
Cable Bridge On Krishna River News: ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్ర పరితల రవాణా శాఖ ఆమోదం తెలపగా... తాజాగా మరో అడుగు ముందుకు పడింది. వంతెన నిర్మాణంతోపాటు దానికి రెండు వైపులా రెండు రాష్ట్రాల పరిధిలో 170 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Cable Bridge On Krishna River Updates: దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ నడుమ నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే దీనిని పూర్తిచేసేందుకు ఆమోదముద్ర వేసింది. అంతేకాదు నదికి అటూఇటు ఉన్న రహదారుల విస్తరణకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సోమశిల వద్ద రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ తీగల వంతెన నిర్మాణంతో పాటు దానికి రెండు వైపులా రెండు రాష్ట్రాల పరిధిలో 170 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది.
ట్రెండింగ్ వార్తలు
ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు విషయంలోనూ కేంద్రం లోతుగానే కసరత్తు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని రహదారులను వేర్వేరు ప్రమాణాలతో నిర్మిస్తే వంతెన అనుసంధానానికి ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయంతోనే నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చింది. ఫలితంగా రెండు రాష్ట్రాల అధికారులను సమన్వయం చేయనుంది.
తగ్గనున్న దూరం...
దేశంలో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిలలో మొదటిది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మితం కానుంది. బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు 80 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనికి తెలంగాణ వైపు లలితా సోమేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర వైపు సంగమేశ్వర స్వామి ఆలయం ఉండగా, వంతెన చుట్టూ శ్రీశైలం జలాశయం, నల్లమల అడవులు, ఎత్తైన కొండలతో ప్రకృతి రమణీయంగా ఉండనుంది.
కృష్ణానదిపై నిర్మించే వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్ వాక్వే కూడా ఏర్పాటు చేయనున్నారు. గ్లాస్ వాక్వేతో నిర్మితం కానుండటంతో పర్యాటకంగా ఈ మార్గం టూరిస్ట్ డెస్టినేషన్ అవుతంది. తెలంగాణలోని కొల్లాపూర్ నుంచి ఏపీకి నేరుగా వెళ్లాలంటే పడవలో ప్రయాణించాల్సిందే. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి కడప, చిత్తూరు, తిరుపతి వెళ్లేవారు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
సంబంధిత కథనం