సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఎస్వీ కళాశాల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదు మంది గాయపడ్డారు.
ఈ ఘటనలో క్లినర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడినట్లు గుర్తించారు. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందాడు. మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు గుంటూరుకు చెందిన సాయి, రసూల్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.