హైదరాబాద్‌లో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్ట్‌…ఫేస్‌బుక్‌‌ పరిచయంతో హైదరాబాద్‌ యువతిని పెళ్లాడిన ఓ నిందితుడు-two bangladeshis arrested in hyderabad one married hyderabad girl ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్ట్‌…ఫేస్‌బుక్‌‌ పరిచయంతో హైదరాబాద్‌ యువతిని పెళ్లాడిన ఓ నిందితుడు

హైదరాబాద్‌లో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్ట్‌…ఫేస్‌బుక్‌‌ పరిచయంతో హైదరాబాద్‌ యువతిని పెళ్లాడిన ఓ నిందితుడు

Sarath Chandra.B HT Telugu

బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లో చొరబడిన ఓ నిందితుడు నకిలీ పత్రాలతో ఆధార్‌ కార్డు పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. నార్సింగ్ మునిసిపాలిటీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో జనన ధృవీకరణ పత్రాన్ని పొందినట్టు గుర్తించి నిందితులతో పాటు నలుగురు హైదరాబాదీలను అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో ఇద్దరు బంగ్లాదేశీయుల అరెస్ట్‌

హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులకు ఆధార్‌ కార్డులు సృష్టించే గుట్టును పోలీసులు చేధించారు. నార్సింగి మునిసిపాలిటీ ఉద్యోగి రూ.15వేలకు జనన ధ్రువపత్రం జారీ చేయడంతో వాటి సాయంతో ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌ పొందే ప్రయత్నం చేశారు. వీరి వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో నార్సింగ్ మున్సిపాలిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం ఏజెంట్లకు రూ.25వేలు చెల్లించి డాంకీరూట్ ద్వారా దేశంలోకి ప్రవేశించాడు. కోల్‌కత్తా సౌతారాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు తయారు చేయించాడు. కొన్నాళ్లు కోల్‌కత్తాలో కరాటే శిక్షకుడిగా చేశాడు.

హసిబుల్‌కు 2023 డిసెంబరులో ఫేస్‌బుక్‌లో మలక్‌పేటకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. జోవన్‌ చౌదరిగా ఆమెతో పరిచయం పెంచుకొని తాను కోల్‌కత్తా వాసినంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మకాం మలక్‌పేటకు మార్చాడు.

8 నెలల క్రితం నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుధీర్‌ కుమార్‌ను కలిసి రూ.15వేలు ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో జనన ధ్రువపత్రం సేకరిం చాడు. ఆ తర్వాత అదే పేరుతో ఓటరుకార్డు సంపాదించాడు.

ఈ పేర్లతో ఆధార్ కార్డును పొందేందుకు సిద్ధమయ్యాడు. 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కత్తా చేరి టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న రోహన్ కు నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. వీరిద్దరు నకిలీ ఆధార్‌ కార్డులతో పాస్ పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అవి నకిలీవిగా తేలటంతో సెంట్రల్ జోన్‌ పోలీసులకు సమాచారం అందింది.

నార్సింగ్ మునిసిపల్‌ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు తమకు జనన ధ్రువపత్రం కావా లని సుధీరుమార్‌ను కోరటంతో అతను ఇచ్చేందుకు అంగీకరించాడు.

స్థానికుల సహకారం…

నిందితులకు స్థానికంగా ఉంటున్న వారుసహకరించినట్టు పోలీసులు గుర్తించారు. హసీబుల్‌ హైదరాబాద్‌లో ఆన్లైన్ ఫుడ్ యాప్ డెలివరీ ఏజెం ట్ గా పనిచేస్తున్నాడు. పాన్‌షాప్ యజమాని మహ్మద్ ముఖీబ్‌ ద్వారా చాదర్‌ఘాట్‌కు చెందిన కిరణ్‌ కుమార్‌ను పరిచయం చేసుకున్నాడు. స్థానికత విషయంలో ఇబ్బందులు రాకుండా నకిలీ పత్రాలు పొందేందుకు పాన్ షాప్ యజమాని సాయం తీసుకున్నాడు.

హసీబుల్‌కు డేట్‌ ఆఫ్‌ బర్త్, ఓటరు కార్డు రావడంతో కోల్‌కత్తాలో ఉంటున్న అతని స్నేహితుడు రోమన్ సాహ కూడా హైదరాబాద్్ వచ్చాడు. హసీబుల్‌తో కలిసి మలక్‌పేటలో ఉంటున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు.

నిందితుల అరెస్ట్‌…

నిందితుల వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, బంగ్లాదేశ్ పాస్‌పోర్టు జిరాక్స్, ఏడు సెల్‌ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ జారీ చేసి అరెస్టయిన కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ కుమార్ జారీ చేసిన సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు నార్సింగ్ మునిసిపల్ కమిషనర్ కృష్ణ మోహన్‌ రెడ్డి ప్రకటించారు.

ఈ కేసులో జి. సుధీర్ కుమార్(27), ఏజెంట్లు మహ్మద్ ముఖీబ్(39), టి.సాయికి రణ్(50), జి. రంజనీకాంత్‌తో పాటు బంగ్లా దేశ్‌కు చెందిన మహ్మద్ హసిబుల్ (, రోహన్ లను అరెస్ట్ చేసినట్టు టాస్క్ ఫోర్స్ డీసీపీ. వై.వి.ఎస్. సుధీంద్రకుమార్ తెలిపారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం