Kavitha vs Revanth Reddy: అవి కాంగ్రెస్ హత్యలే… త్యాగాలు చేసిందెవరు..?
Kavitha Revanth reddy Twitter war: తెలంగాణ దీక్షా దివాస్(నవంబర్ 29) సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఓ ట్వీట్ చేశారు. ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కాస్త వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ కు దారి తీసింది. అసలేం జరిగిందంటే....
TRS MLC Kavitha vs TPCC Chief Revanth reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. ఇందుకు ట్విట్టర్ వేదికైంది. దీక్షా దివాస్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఓ ట్వీట్... ఇందుకు కారణమైంది. "తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీ కి పోటీ చేసి గెలిచా" అంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కాసేపటికే తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ ఖాతా నుంచి రిప్లే వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
‘‘ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! కవిత గారూ. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు.. చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే!’’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఈ ట్వీట్ పై కవిత స్పందిస్తూ.. మరో ట్వీట్ చేశారు. "తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు" అని మండిపడ్డారు.
సోనియా గాంధీ, ప్రియాంకగాంధీ గారూ బతుకుమ్మ ఎత్తించినా.. బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే అని కవిత స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో ఆడబిడ్డలము ముందున్నాము.. మీరు ఎక్కడున్నారు? మీ పార్టీ ఎక్కడుంది? అని కవిత ప్రశ్నించారు.
ఇదిలా నడుస్తుండగా... రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ‘‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. బతుకమ్మ ఆడినందుకే.. బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అమరవీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అందుకే.. త్యాగాలు చేసిందెవరు.. భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది. అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్లకు, చెవులకు అవి కనబడవు.. వినబడవు.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇందుకు కవిత కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “ తుపాకీ ”ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం , బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది" అంటూ రాసుకొచ్చారు.