వాట్సప్ వీడియో కాల్ వైద్యం వికటించి.. గర్భంలోనే కవలలు మృతిచెందారు. పెళ్లైన ఏడేళ్ల తర్వాత సంతానం కలగబోతోందని ఆనందపడ్డ ఆ దంపతులకు గర్భశోకం మిగిలింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం చేయాలని.. ఎక్కడో ఉన్న వైద్యురాలు నర్సుకు వీడియో కాల్ ద్వారా సూచించింది. ఆ వైద్యం వికటించిన కవలలు మృతిచెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది.
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్, కీర్తిలకు ఏడేళ్ల కిందట వివాహం అయ్యింది. కానీ సంతానం కలగలేదు. దీంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో డాక్టర్ అనూషారెడ్డి దగ్గర వైద్యం చేయించుకున్నారు. ఈ క్రమంలో కీర్తి గర్భం దాల్చింది. 5 నెలల గర్భిణిగా ఉన్న కీర్తికి నొప్పులు రావడంతో.. అదే ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు.
కీర్తిని ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో.. వైద్యురాలు అందుబాటులో లేదు. సిబ్బంది సమాచారం ఇవ్వగా.. డాక్టర్ వీడియో కాల్ ద్వారా చేసిన సూచనల మేరకు.. గర్భిణి కీర్తికి నర్సు ఇంజక్షన్లు ఇచ్చి చికిత్స చేసింది. ఆ వైద్యం వికటించి గర్భంలో ఉన్న ఇద్దరు శిశువులు మృతిచెందారు. అయినా.. బిల్లు రూ.30 వేలు చెల్లించాలని బాధితులను ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేసింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని.. బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఇప్పటికే రూ. 15 లక్షల వరకు ఖర్చు చేశామని.. కవల పిల్లలు పుడుతున్నారని సంతోషపడ్డామని బాధితులు చెప్పారు. ఇలా వైద్యురాలి నిర్లక్ష్యంతో విషాదం జరిగిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం జిల్లా వైద్యాధికారికి తెలిసింది. ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు.. ఆసుపత్రిని సీజ్ చేశారు.
సంబంధిత కథనం