Bandi Sanjay Praja Sangrama Yatra: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే 4 దశలు పూర్తి చేసిన ఆయన... గురువారంతో ఐదో విడత పాదయాత్ర కూడా పూర్తి చేయనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభను తలపెట్టారు. ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్లో సాయంత్రం నిర్వహిస్తున్న బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
గత నెల 28న నిర్మల్ జిల్లా భైంసాలో మొదలైన పాదయాత్ర.. ఐదు జిల్లాల్లో 18 రోజులు, 222 కిలోమీటర్లు సాగింది. ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇవాళ ఇవాళ కరీంనగర్లో పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
ఓవైపు టీఆర్ఎస్... బీఆర్ఎస్ గా మారటం, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉండటం, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై జేపీ నడ్డా ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ టార్గెట్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర విచారణ సంస్థలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నడ్డా ఎలా స్పందిస్తారనేది చూడాలి. మరోవైపు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన కరీంనగర్లోనే.. సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ పని అయిపోయిందనే సంకేతాలు పంపాలని కమలనాథులు యోచిస్తున్నారు.
బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ చేసేలా ప్రణాళికలను అమలు చేసే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఇదే బహిరంగ సభ వేదిక నుంచే ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జేపీ నడ్డా 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతారు. ఎయిర్పోర్టులోనే పార్టీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం కరీంనగర్ బయలుదేరకు చేరుకుంటారు.