TSRTC : ఇక ఊరికో బస్‌ ఆఫీసర్‌.. తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయత్నం, మార్గదర్శకాలివే-tsrtc to appoint village bus officers across telangana state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc To Appoint Village Bus Officers Across Telangana State

TSRTC : ఇక ఊరికో బస్‌ ఆఫీసర్‌.. తెలంగాణ ఆర్టీసీ వినూత్న ప్రయత్నం, మార్గదర్శకాలివే

HT Telugu Desk HT Telugu
Apr 23, 2023 12:04 PM IST

TSRTC Latest News: తెలంగాణ ఆర్టీసీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో బస్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఎండీ సజ్జనార్ విడుదల చేశారు.

తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయం

TSRTC Village Bus Officers: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు పక్క రాష్ట్రాలకు కూడా సరికొత్త సర్వీసులను నడుపుతోంది. ఇదిలా ఉంటే…తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో... గ్రామాల్లో బస్‌ ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా శనివారం విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ కొత్త వ్యవస్థ మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. మున్సిపాలిటీల్లో వార్డుకో బస్‌ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తామని ప్రకటించారు.

మార్గదర్శకాలివే…

గ్రామాల్లో నివసించే సంస్థ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్‌ బస్‌ ఆఫీసర్లగా డిపో మేనేజర్లు నియమిస్తారు. నియామకాల్లో ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలుండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకువచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద గ్రామానికి ఒకరు బస్‌ ఆఫీసర్‌గా ఉంటారు. చిన్నవైతే రెండు, మూడు గ్రామాలకు ఒకరిని నియమిస్తారు. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఒక్కరికి 5 గ్రామాల కంటే ఎక్కువగా కేటాయించేందుకు వీల్లేదు.

హైదరాబాద్‌ సహా మిగతా మున్సిపాలిటీల్లోనూ వార్డుకో బస్‌ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారు. వారు ఆయా వార్డుల పరిధిలో విలేజ్‌ బస్‌ ఆఫీసర్లలాగే పనిచేస్తారు.

ఈ విలేజ్‌ బస్‌ ఆఫీసర్లు గ్రామస్తులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ బస్‌ అధికారులు 15 రోజులకోసారి గ్రామస్తులతో సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, సమయాలు, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యలు, తదితర అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని పై అధికారులకు చేరవేస్తారు.

గ్రామాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతరల వివరాలను వారు సేకరిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్టుగా బస్‌ ట్రిప్ లను పెంచుతారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు తమ అద్దె బస్సులను ఉపయోగించుకోవాలని వివరిస్తారు. ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్తే జరిగే అనర్థాలను ప్రజలకు చెప్తారు.

గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘాల నాయకులు, డ్వాక్రా గ్రూప్‌ సభ్యులతో పాటు పంక్షన్‌ హాల్స్‌ నిర్వాహకులను బస్‌ ఆఫీసర్లు సంప్రదిస్తారు. వారికి తమ సెల్‌ఫోన్‌ నంబర్లను అందజేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థతో పాటు టీఎస్‌ఆర్టీసీ కార్యక్రమాలను వివరిస్తారు.

ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలోని నోటీస్‌ బోర్డులో సంబంధిత విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వివరాలను స్థానిక డిపో మేనేజర్‌ పొందుపరుస్తారు. అందులో బస్‌ ఆఫీసర్‌ పేరు, ఫోన్‌ నంబర్‌ ఉంటుంది. ''మీ గ్రామానికి వచ్చే బస్సులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, రాయితీ పథకాలతో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బస్సులను అద్దెకు పొందుటకు విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ను సంప్రదించండి." అని పేర్కొంటారు.

ప్రతి గ్రామ సర్పంచ్‌కు తమ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వివరాలను లేఖ రూపంలో తెలియజేస్తారు. ఆ ఆఫీసర్‌ సేవలను వినియోగించుకోవాలని కోరుతారు.

మంచిగా పనిచేసే విలేజ్‌ బస్‌ ఆఫీసర్లను ప్రోత్సహించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతి మూడు నెలలకోసారి పనితీరు మంచిగా ఉన్న వారిని బెస్ట్‌ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ అవార్డుతో సత్కరించనుంది. ఈ విధానం వల్ల అందరూ మంచిగా పనిచేసే అవకాశముంది.

''గ్రామాల్లో సర్వీస్‌లకు సంబంధించి ఎమైనా సమస్యలుంటే ప్రస్తుతం డిపో మేనేజర్లను సంప్రదించాలి. చాలా గ్రామాలకు డిపో దూరంగా ఉంది. శుభకార్యాలకు అద్దె బస్సులను బుక్‌ చేసుకోవాలన్నా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ వ్యవస్థతో ఇక ఆ సమస్య ఉండదు. ప్రతి సమస్యను ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రజల అవసరాలను చెప్పొచ్చు. ప్రజలు, టీఎస్‌ఆర్టీసీకి అనుసంధానకర్తల్లాగా ఈ ఆఫీసర్లు పనిచేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 10 వేల గ్రామాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఆయా గ్రామాల్లో 2 వేలకు పైగా విలేజ్‌ బస్‌ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. ఈ విలేజ్‌ బస్‌ ఆఫీసర్ల వ్యవస్థను వినియోగించుకుని ప్రోత్సహించాలి." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కోరారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం