TSRTC New Buses : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
TSRTC New Buses : టీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరికొన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంట్లో ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలో కొత్తగా 1020 సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తోంది టీఎస్ఆర్టీసీ(TSRTC). ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరికొన్ని రోజుల్లో కొత్త బస్సులు రోడ్లపైకి రానున్నాయి. ఈ కొత్త బస్సుల్లో సూపర్ లగ్జరీ(Super Luxury), ఎలక్ట్రిక్ బస్సులు(Electric Buses) కూడా ఉన్నాయి. మెుత్తం 1020 బస్సులను ఆర్టీసీ తీసుకువస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
మరో రెండు మూడు నెలల్లో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చెందుకు ఆర్టీసీ(RTC) ప్లాన్ చేస్తోంది. ఈ బస్సుల్లో 720 బస్సులు సూపర్ లగ్జరీ బస్సులు కాగా.., 300 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రతిపాదికన తీసుకురానున్నారు. తెలంగాణ(Telangana)లోని జిల్లాల్లో తిరిగి పాతబడిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్లో అందుబాటులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత బస్సులు మియాపూర్ బస్ బడీ బిల్డింగ్ లో మార్పు చేస్తారు. వాటిని సిటీ బస్సులుగా మార్చే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. తెలంగాణ ఆర్టీసీ. మెట్రో కాంబినేషన్ టికెట్(Metro Comibination Ticket) ధరను రూ.20 నుండి రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం కోసం తగ్గించినట్లు ప్రకటించింది. సిటీ బస్ పాస్(City Bus Pass) కలిగిన విద్యార్థులు మెట్రో సర్వీసుల్లో ప్రయాణించాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) ట్వీట్ చేశారు.
కొద్దిరోజుల కిందటే కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్ఆర్టీసీ. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తో సిటీ బస్సులతోపాటు పల్లెవెలుగు(Pallevelugu), ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేసేలా ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ(RTC) పేర్కొన్న సంగతి తెలిసిందే. పుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని.. పలుమార్లు ప్రమాదాలకు గురి అవుతున్నారని వెల్లడించింది. వీటిపై మీడియాలో కూడా కథనాలు వచ్చాయని... విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని డిపోలకు ఆదేశాలను జారీ చేసింది.
నిజానికి హైదరాబాద్ నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్ కాలేజీలు(Engineering) ఉన్నాయి. వీటితో పాటు డిగ్రీ, ఇంటర్, ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఇక కాలేజీలకు వెళ్లాలంటే పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటోంది.