TSRTC : విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ - ఇక ఆ బస్సుల్లో కూడా వెళ్లొచ్చు…
TSRTC Good News To Students: విద్యార్థులకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ఇక నుంచి పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసుల్లో ప్రయాణించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
TSRTC Latest News: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తో ఇక నుంచి సిటీ బస్సులతోపాటు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ విద్యార్థులు ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు ఎండీ సజ్జనార్.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆర్టీసీ పేర్కొంది. పుట్ బోర్డు ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని.. పలుమార్లు ప్రమాదాలకు గురి అవుతున్నారని వెల్లడించింది. వీటిపై మీడియాలో కూడా కథనాలు వచ్చాయని... విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని డిపోలకు ఆదేశాలను జారీ చేసింది.
నిజానికి హైదరాబాద్ నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటు డిగ్రీ, ఇంటర్, ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఇక కాలేజీలకు వెళ్లాలంటే పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దీంతో ఈ రూట్లలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికితోడు విద్యార్థులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఉపశమనం కలిగి అవకాశం ఉంటుంది. వారికి నచ్చిన బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కలుగనుంది.