TSRTC : టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు, 8వ డీఏ మంజూరుకు నిర్ణయం
TSRTC : తమ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ మరో విడత డీఏ ప్రకటించింది. జనవరి నుంచి ఇవ్వాల్సిన 5 శాతం డీఏను సెప్టెంబర్ నెల జీతంతో కలిపి ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.
TSRTC : టీఎస్ఆర్టీసీ.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారన్న సజ్జనార్... పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
రాఖీకి రికార్డు ఆదాయం
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు అని సంస్థ ప్రకటించింది. గత ఏడాది రాఖీ పండుగ(12.08.2022) నాడు రూ.21.66 కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా ఆర్జించింది. ఈ రాఖీ పౌర్ణమి నాడు రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టీఎస్ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గత ఏడాది కన్నా లక్ష మంది అదనంగా రాకపోకలు సాగించట్లు తెలుస్తోంది. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసీ బస్సులు నడిపారు. 2022లో రాఖీ పండగ నాడు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగగా.. ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు నడిచాయని యాజమాన్యం తెలిపింది.