TSPSC Chairman Comments : షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1.. నమ్మితే గొంతు కోశారు
TSPSC Paper Leak : పేపర్ లీకేజీ ఘటనపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జానార్దన్ రెడ్డి స్పందించారు. దురదృష్టకరమైన వాతావరణంలో ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన దుమారం రేపుతోంది. దీనిపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్(TSPSC Chairman) జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏఈ పరీక్ష మీద బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిపారు. తాజాగా వస్తున్న వదంతులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టుగా స్పష్టం చేశారు. 30 లక్షల మంది వన్టైమ్ రిజిస్ట్రేషన్(One Time Registration) చేసుకున్నారని ఆయన తెలిపారు. టీఎస్పీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ను యూపీఎస్సీ కూడా మెచ్చుకుందని గుర్తుచేశారు. ఏపీపీఎస్సీ ఉన్న సమయంలో ఏటా నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక.. సుమారు 35 వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నట్టుగా తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం సుమారు 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని జనార్దన్ రెడ్డి చెప్పారు. టీఎస్పీఎస్సీ(TSPSC) అనేక నూతన విధానాలను తీసుకొచ్చిందని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్(Group 1 Prelims) దేశంలో ఎక్కడా లేనట్టుగా జంబ్లింగ్ చేశామన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నలు, సమాధానాలు మల్టిపుల్ జంబ్లింగ్ చేశామని, అక్రమాలకు ఆస్కారం ఉండకూడదనే.. జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిందని, అభ్యంతరాల స్వీకరణకు ఐదు రోజులు సమయం ఇచ్చామన్నారు.
నిపుణులను సంప్రదించాకే.. గ్రూప్ 1 ఫైనల్ కీ(Group 1 Final Key) ఇచ్చినట్టుగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వడపోత పరీక్ష మాత్రమేనన్నారు. అందుకే మార్కులు ఇవ్వడం లేదని చెప్పారు. టౌన్ ప్లానింగ్ పరీక్షకు ముందు రోజు సమాచారం వచ్చిందని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసుల దర్యాప్తులో తొమ్మిది మంది నిందితులుగా తేల్చారన్నారు. అయితే ఐపీ అడ్రెస్ లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కు తెలిసే అవకాశం ఉందన్నారు.
రాజశేఖర్ ముఖ్యమైన సమాచారం యాక్సెస్ చేసినట్టుగా అనుకుంటన్నాం. రాజేశేఖర్ సాయంతో ఏఎస్ఓ ప్రవీణ్ పేపర్లు తీసుకున్నాడు. ప్రవీణ్ రూ.10 లక్షల కోసం పేపర్లు అమ్మాడని తెలిసింది. లీకేజీ పరిణామాల కారణంగా అత్యవసర భేటీ నిర్వహించాం. నా కుమార్తె ప్రిలిమ్స్ రాసిందనే వార్తల్లో నిజం లేదు. ఏఈ పరీక్ష మీద బుధవారం నిర్ణయం తీసుకుంటాం. ప్రవీణ్ కు మాత్రం గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు వచ్చిన మాట నిజమే
- జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్
‘కమిషన్లో నమ్మిన వాళ్లే గొంతు కోశారు. గ్రూప్1 మెయిన్స్ జూన్ 5 నుంచే నిర్వహిస్తాం. ఎగ్జామ్ లో విజేతలు కాని వారు కోర్టులకు వెళ్లడం సాధారణమే. మా సమయం కోర్టు కేసులతో సరిపోతోంది. లీకేజీ వ్యవహారం మీద పోలీసులు వేగంగా స్పందించారు. లీకేజీలో ప్రమేయం ఉన్న వారి ఉద్యోగాలు పోతాయి. ప్రవీణ్, రాజేశేఖర్, రేణుక, రేణుక భర్త ఉద్యోగాలు ఉండవు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక.. నిజం తెలుస్తుంది.’ అని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ అన్నారు.
టాపిక్