HC On MLAs Poaching Case: BL సంతోష్కు మరోసారి నోటీసులివ్వండి - సిట్ కు ఆదేశాలు
TS High Court On MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులివ్వాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది.
Telangana High Court On BL Santhosh Notices: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. బుధవారం విచారించిన కోర్టు.... బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులివ్వాలని సిట్ ను ఆదేశించింది. నోటీసులిచ్చినా సిట్ దర్యాప్తునకు హాజరుకాని బీఎల్ సంతోష్ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని సిట్, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరాయి. ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఈ నెల 9న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశాయి. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా బీఎల్ సంతోష్ కు నోటీసులు పంపాలని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
బీఎల్ సంతోష్ విచారణకు హాజరు కావడం లేదని విచారణ ఆలస్యం అవుతుందనని ఏఏజీ.... హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని ..అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల్ని ఎత్తివేయాలని కోరారు. అయితే ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. నిజానికి బీఎల్ సంతోష్కు మంగళవారమే నోటీసులు ఇచ్చామని కోర్టుకు సిట్ తరపు న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ సిట్ జారీచేసిన నోటీసును ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలోని హేమేందర్ అనే వ్యక్తికి అందజేశారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో బీఎల్ సంతోష్ లేరని, గుజరాత్లో ఉన్నారని చెప్పారు. సిట్ నోటీసుల జారీకి సంబంధించి ఢిల్లీ పోలీసులు అందజేసిన వివరాలను కోర్టుకు నివేదించారు. అయితే ఈ సారి నేరుగా ఆయనకే మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా నోటీసులు అందించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇక బీజేపీ నేత, పిటిషనర్ ప్రేమేందర్ రెడ్డి తరపున మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని కోర్టుకు చెప్పారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం... విచారణకు వచ్చేందుకు ఎప్పటి వరకు సమయం కావాలని ప్రశ్నించింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారని న్యాయవాది చెప్పుకొచ్చారు. మరోవైపు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీలో జరిగే బీజేపీ వ్యవహారాల గురించి రాష్ట్ర బీజేపీ వాళ్లకు తెలియదా? అని వ్యాఖ్యానించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పిటిషనర్ ప్రేమేందర్ రెడ్డి) ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరఫున బాధ్యత తీసుకోవాలి కదా? అని ప్రశ్నించింది. ఇంతకీ బీఎల్ సంతోష్ తరఫున ఏ న్యాయవాది ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రశ్నించింది. 41ఏ నోటీసును సవాల్ చేశారు కదా? అని గుర్తు చేసింది.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసుపై న్యాయవాది పి.ప్రతాప్ హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 22న సిట్ ఇచ్చిన నోటీసు రద్దు చేయాలని ప్రతాప్ హైకోర్టును కోరారు. ఈ నెల 25న హాజరుకావాలన్న సిట్ నోటీసుపై స్టే ఇవ్వాలన్నారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
అయితే సిట్ మరోసారి నోటీసులు ఇస్తే బీఎల్ సంతోష్ విచారణకు వస్తారా..? లేకుండా మరింత సమయం తీసుకుంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది.