Telangana Jobs : ఆరేళ్లలో తెలంగాణలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు
Telangana at a Glance 2022 : తెలంగాణలో ఆరేళ్ల కాలంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాలు.. సృష్టించినట్టు ప్రభుత్వం చెబుతోంది. టీఎస్ ఐపాస్ కింద ఉద్యోగాలు సృష్టించినట్టుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ చెప్పారు.
తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ 2022 నివేదికను రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ విడుదల చేశారు. 2015-16 నుంచి 2021-22 వరకు ప్రభుత్వం సృష్టించిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 16.48 లక్షలకు పైగా ఉంది. రూ. 232,311 కోట్ల పెట్టుబడితో 19,400 యూనిట్లకు పైగా ఉంది.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ విడుదల చేసిన 'తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ 2022'లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆరేళ్ల కాలంలో TS-iPASS కింద 16,48,934 ఉద్యోగాలు సృష్టించారు. ప్రభుత్వం 19,452 యూనిట్లకు ఆమోదం తెలిపింది. రూ. 232,311 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
నివేదిక ప్రకారం, రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, ఇందులో 1.76 కోట్ల మంది పురుషులు, 1.73 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ప్రతి చదరపు కి.మీ జనాభా సాంద్రత 312, ఇది జాతీయ 382 కంటే తక్కువ. గ్రామీణ జనాభా 2.13 కోట్లు. పట్టణ జనాభా 1.36 కోట్లు. దాదాపు 2.06 కోట్ల మంది అక్షరాస్యులు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 34.16 శాతం జనాభా 30 ఏళ్లలోపు వారే.
వైద్యం, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ తెలిపారు. ప్రజలందరి ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయంగా వైద్యం, ఆరోగ్యం, విద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. విద్యారంగంలోనూ మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను NITI అయోగ్ ప్రశంసించి.. దీనిని ధృవీకరించిందని చెప్పారు.
తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. ప్రముఖ ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రతినిధి ప్రొ.కార్తీక్ మురళీధరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
' సీఎం కేసీఆర్ కు అన్ని అంశాలపై స్పష్టమైన దృక్పథం ఉంది. దానికి అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్. ప్రత్యేకించి యువత ప్రయోజనాల దృష్ట్యా అదే అమలు చేస్తోంది.' అని వినోద్ కుమార్ అన్నారు.