BRS Party Announcement : తెలంగాణ బరిలో ఇక అన్నీ జాతీయ పార్టీలే.. ఆ ఒక్కటి తప్పా?
KCR National Party : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా తీర్మానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాలు అంటున్న కేసీఆర్ ఇక క్లియర్ కట్ గా దృష్టిసారిస్తున్నారని అర్థమవుతోంది. తెలంగాణలో ఇక వచ్చే ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ ఉండేది మాత్రం జాతీయ పార్టీల మధ్యనే.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన జరిగిపోయింది. ఇక టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. తెలంగాణలో మాత్రం జాతీయ పార్టీలు పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఉండేది కూడా వాటి నడుమే. టీఆర్ఎస్ ఇన్నీ రోజులు ప్రాంతీ పార్టీగా ఉండగా.. జాతీయ పార్టీగా ప్రకటించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పోరు జాతీయ పార్టీల నడుమే సాగనుంది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుంది.
ఇప్పటికే తెలంగాణలో కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇంకొన్ని పార్టీలూ.. జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. తాజాగా తెలంగాణ కోసం ప్రాంతీయ పార్టీగా పోరాడిన టీఆర్ఎస్.. సమైఖ్య భారత్ అనే నినాదంతో భారత్ రాష్ట్ర సమితిగా మారింది. బీజేపీ విధానాలే వ్యతిరేకంగా.. పేరు, అజెండాలను మార్చుకుంది. ఇక ఇప్పటి నుంచి.. తెలంగాణలో అన్నీ జాతీయ పార్టీలే కానున్నాయి.
ఇప్పటికే తెలంగాణ బరిలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం జాతీయ పార్టీలుగా ఉన్నాయి. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం లాంటి పార్టీలు జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చిందా ఇవ్వలేదా అన్నది తర్వాత సంగతి. కానీ ఒకటికి మించిన రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, జాతీయ పార్టీ అని అంటున్నాయి. దీంతో తెలంగాణ బరిలో నిలిచేది.. జాతీయ పార్టీలే. కానీ వైఎస్ షర్మిల.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే ప్రాంతీయ పార్టీగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది. దీని తర్వాతే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ గతవారం రోజుల కిందటే పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉంటుందనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే కేసీఆర్ అధ్యాత్మిక పర్యటనలు చేపట్టారు. ఈ మేరకు అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్ గడ్డ సాక్షిగా టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా ప్రకటిస్తూ తీర్మానం చేశారు. నాడు కేవలం తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పాటు కాగా… ఇక బీఆర్ఎస్ అజెండా, జెండా ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.