MPs On MLA Seats : అసెంబ్లీ స్థానాలపై కన్నేసిన ఎంపీలు.. పోటీ చేస్తారా?
Telangana Assembly Elections : తెలంగాణలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుంది. 2023 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఎంపీలు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్(TRS) పార్టీలో మాత్రం ఓ రకమైన చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎంపీలు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విషయంపై గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే గులాబీ బాస్ సిట్టింగులపై ఎమ్మెల్యే టికెట్లు(MLA Tickets) అని స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఎంపీల గురించి చర్చ నడుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
నిజామాబాద్(Nizamabad) నుంచి ఎంపీగా పోటీ చేసి కవిత ఓడిపోయారు. అయితే ఈసారి జీవన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎలాంటి స్పష్టత లేకున్నా.. కొంతమంది మాత్రం చర్చకు లేపారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Aravind) ఆర్మూర్ అసెంబ్లీ స్థానానికి మారాలని భావిస్తున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా.. తనపై పోటీ చేసి ఓడిస్తానని కవిత ఇటీవల సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు కూడా అసెంబ్లీ స్థానాలకు మారాలని యోచిస్తున్నారని సమాచారం. అరవింద్పై కవిత ఇటీవల మాటల దాడి చేయడంతో రాష్ట్ర రాజకీయాలు గరం గరంగా మారాయి. ఇక ఎన్నికల సమరం మెుదలైందా అనిపించేలా సాగింది వారి మధ్య మాటల యుద్ధం. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చ లేచింది. టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీల నేతలు లోక్సభ నుంచి అసెంబ్లీ స్థానాలకు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.
జీవన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నుంచి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పోటీ చేయాలని చూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఆయన సెగ్మెంట్లో ఇల్లు తీసుకుని ప్రజలకు చేరువయ్యే పనిలో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. బీజేపీ నేతకు కవిత సవాల్ విసరడంతో ఆమె ఆర్మూర్ నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, తాండూరు లేదా మరో నియోజకవర్గం వైపు చూస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ(Dubbaka Assembly) సెగ్మెంట్ పై కన్నేశారని ప్రచారం నడుస్తోంది. మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత తన తండ్రి రెడ్యానాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోర్నకల్ సీటు వైపు చూస్తున్నారని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర పదవీ కాలం తక్కువగా ఉన్నందున ఆయన వరంగల్ లేదా ఖమ్మం నుంచి అసెంబ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చర్చ లేచింది.
అయితే ఇటీవల పార్టీ మీటింగ్ లో మాత్రం.. కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ అని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసే దిశంగా 10 నెలలు కష్టపడాలని కేసీఆర్(KCR) చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా.. అంతటా తిరగాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రలోభాలకు ఎమ్మెల్యేలు(MLAs) లొంగొద్దని చెప్పారు. మునుగోడు ఫలితాల్లో(Munugode Result) గెలిచామని, కానీ మెజారిటీ తగ్గడంపై మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు(MLA Tickets) ఇవ్వనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. మంత్రులు.. ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని చెప్పారు.