TRS: ఇవాళ సీఎం కేసీఆర్ కీలక భేటీ.. మంత్రులు, జిల్లా అధ్యక్షులతో చర్చ!
ఇవాళ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. మంత్రులతో పాటు జిల్లాల అధ్యక్షులతో భేటీ కానున్నారు.
KCR Key Meeting With Party Leaders: జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దసరా రోజున ముహుర్తం ఖరారు చేశారన్న వార్తల నేపథ్యంలో.... ఇవాళ ప్రగతిభవన్ వేదికగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో భాగంగానే ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
మంత్రులు, జిల్లా అధ్యక్షులకు శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో.. అందుకు సన్నాహకంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. శనివారం వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన సభలో కొత్త పార్టీపై సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. జై తెలంగాణ, జై భారత్ నినాదాలు చేయడంతో..కొత్త పార్టీ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దసరా లోపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోనూ సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశముంది.
దసరా దగ్గరపడుతున్న వేళ... కొత్త పార్టీ ప్రకటనపై వార్తలు ఓ రేంజ్ లో నే వినిపిస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి ప్రకటన చేస్తారనే సమాచారం అందుతోంది. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఏకాభిప్రాయంతో కేసీఆర్ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఆ దిశగా కసరత్తు కూడా పూర్తి చేశారని సమాచారం. ఇందులో భాగంగానే ప్రాథమికంగా చర్చించేందుకు ఇవాళ ఓ భేటీని నిర్వహించినట్లు తెలుస్తోంది.
అయితే కొత్త పార్టీ జాతీయాధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఉంటారని... రాష్ట్ర శాఖ బాధ్యతలను మంత్రి కేటీఆర్కు అప్పగిస్తారనే వార్తలు బయటికి వస్తున్నాయి. దసరా రోజు ప్రకటన తర్వాత కరీంనగర్లో భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత మొదటి బహిరంగ సభను కూడా కరీంనగర్లోనే పెట్టారు. అదే సెంటిమెంట్ మరోసారి కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారంట...! కరీంనగర్ సభలోనే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది.
మొత్తంగా పార్టీ ప్రకటన, కరీంనగర్ లో భారీ బహిరంగ సభ, హెలికాఫ్టర్, ఫ్లైట్ కొనుగోలు అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయనే చెప్పొచ్చు. ప్రతిపక్షాలు మాత్రం ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం,, సోషల్ మీడియాలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా తెగ పోస్టులు చేస్తున్నారు. దేశ రాజకీయముఖ చిత్రాలను మార్చేందుకు అడుగులు పడుతున్నాయంటూ రాసుకొస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన పక్కా అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే అక్టోబర్ 5వతేదీన ఏం జరగుతుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
టాపిక్