మిస్ వరల్డ్ ప్రతినిధులకు మూడంచెల భద్రత.. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు!-triple security for miss world delegates in warangal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మిస్ వరల్డ్ ప్రతినిధులకు మూడంచెల భద్రత.. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు!

మిస్ వరల్డ్ ప్రతినిధులకు మూడంచెల భద్రత.. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు!

HT Telugu Desk HT Telugu

మిస్ వరల్డ్ పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల నుంచి పోటీల్లో పాల్గొనే అందగత్తెలు రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ నెల 14న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేవారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

మిస్ వరల్డ్ 2025

ఓ వైపు ఇండియా - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరో వైపు ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ హై టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులకు భద్రతపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. వరంగల్ కోట, వేయి స్థంభాల గుడితో పాటు.. రామప్ప ఆలయం వద్ద వారికి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

2 వేల మందితో భద్రత..

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెలు మరో నాలుగు రోజుల్లో వరంగల్‌కు రానున్నారు. రెండు టీములుగా 57 మంది వరంగల్ కు రానుండగా.. అందులో 35 మంది నగరంలోని వేయి స్థంభాల గుడి, కోటను సందర్శిస్తారు. మరో 22 మంది ములుగు జిల్లాలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని విజిట్ చేయనున్నారు. దీంతో భద్రతా లోపాలు తలెత్తకుండా వారికి మూడంచెల పోలీస్ వ్యవస్థతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 వేల మంది సిబ్బందితో భద్రత కల్పించేందుకు సమాయత్తం అవుతున్నారు. 14వ తేదీన రాత్రి వరకు 2 వేల మంది పోలీసులు సుందరీమణుల భద్రత విధుల్లో ఉండనుండగా.. ఆ తరువాత రోజు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడా విధుల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు.

ట్రై సిటీస్‌లో వెయ్యి మంది..

ఓరుగల్లుకు వస్తున్న ప్రపంచ అందగత్తెల కోసం.. ప్రత్యేక కమాండోలతో పాటు పోలీస్ ఆఫీసర్లు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ ట్రై సిటీస్‌లోని హనుమకొండ వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వద్ద మొత్తంగా వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తుకు ప్లాన్ చేశారు. హరిత హోటల్ వద్ద 250 మంది, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వద్ద మరో 800 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇందులో మహిళా పోలీస్ ఆఫీసర్లకు ప్రాధాన్యం కల్పించారు.

సీసీ కెమెరాలతో నిఘా..

భద్రతా పరమైన ఏర్పాట్లలో భాగంగా.. పోలీసులు సీసీ నిఘాపై ఫోకస్ పెట్టారు. నగరంలో ఇప్పటికే 45 వేల సీసీ కెమెరాలు, కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని 500 కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు రామప్ప వద్ద ఆల్రెడీ ఉన్న వాటికి అదనంగా మరో 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీటన్నింటిని హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కు అనుసంధానం చేయగా.. అక్కడి నుంచి పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు.

నో ఫ్లయింగ్ జోన్‌గా రామప్ప..

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని.. వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు సందర్శించనున్నారు. అక్కడ వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రిహార్సల్స్‌ కూడా పూర్తి చేశారు. స్థానిక పరిస్థితులు, భధ్రతాపరమైన అంశాల దృష్ట్యా.. రామప్ప వద్ద ఐదు కిలోమీటర్ల పరిధిలో నో డ్రోన్‌ ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు.

పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం..

మిస్ వరల్డ్ ప్రతినిధుల రాక సందర్భంగా.. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పాసులు జారీ ప్రక్రియ స్టార్ట్ చేశారు. మీడియా సంస్థలతో పాటు ఇతర ప్రముఖలకు ప్రత్యేకంగా పాస్‌లు అందజేస్తున్నారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పాసులపై లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు. దీంతో ప్రపంచ సుందరీమణుల టూర్‌లో రద్దీకి అవకాశం ఉండదని భావిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

సంబంధిత కథనం