హైదరాబాద్‌లో విషాదం.. బెట్టింగ్ యాప్‌లతో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి-tragedy in hyderabad mtech student commits suicide after falling into debt with betting apps ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్‌లో విషాదం.. బెట్టింగ్ యాప్‌లతో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి

హైదరాబాద్‌లో విషాదం.. బెట్టింగ్ యాప్‌లతో అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడిన ఎంటెక్ విద్యార్థి

Sarath Chandra.B HT Telugu

బెట్టింగ్‌ యాప్‌ల కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో బెట్టింగ్‌ యాప్‌‌ల ఉచ్చులో చిక్కుకున్న ఎంటెక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

బెట్టింగ్‌ యాప్‌లతో అప్పుల పాలై ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య

బెట్టింగ్‌ యాప్‌లకు మరో యువకుడు బలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక పోవడంతో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌ మసాబ్‌ ట్యాంక్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఎంటెక్‌ చదువుతున్న పవన్‌ అనే యువకుడు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బెట్టింగ్‌ యాప్‌ల దారుణాలకు మరో యువకుడు బలయ్యాడు. మోసపూరిత యాప్‌లను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటి వలలో చిక్కుకుని సర్వం పోగొట్టుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన అత్తాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

గద్వాలకు చెందిన పెద్ద నర్సింహులు కుమారుడు పవన్ హైదరాబాద్‌లో జేఎన్‌టీయూలో ఎంటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అత్తాపూర్‌లోని ఓ గదిలో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా బెట్టింగ్‌ యాప్‌లలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ చేస్తోన్న పవన్ అప్పుల పాలయ్యాడు. ఇంటి నుంచి తండ్రి పంపే డబ్బులతో పాటు అప్పలు కూడా చేశాడు.

లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని వాటిని బెట్టింగుల్లో పెట్టాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో తండ్రి నర్సింహులు విడతల వారీగా అప్పులు ఇచ్చిన వారికి రూ.98వేలు చెల్లించాడు. అయినా పవన్ అప్పులు తీరక పోవడంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.

అప్పులు తీర్చడానికి తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, ఐ ఫోన్‌లను కూడా విక్రయించాడు. అప్పులు తీరకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం సాయంత్రం ఉంటున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్నేహితులు తిరిగి వచ్చే సరికి ప్రాణాలు కోల్పోయాడు. వారు ఇచ్చిన సమాచారంతో అత్తాపూర్‌ ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం