‌Hyd Scientist Suicide: హైదరాబాద్‌లో విషాదం.. పుట్టినరోజు కుమార్తెను చూడనివ్వని భార్య.. ఆత్మహత్యకు పాల్పడిన శాస్త్రవేత్త-tragedy in hyderabad a scientist from guntur district commits suicide due to harassment by his wife ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ‌Hyd Scientist Suicide: హైదరాబాద్‌లో విషాదం.. పుట్టినరోజు కుమార్తెను చూడనివ్వని భార్య.. ఆత్మహత్యకు పాల్పడిన శాస్త్రవేత్త

‌Hyd Scientist Suicide: హైదరాబాద్‌లో విషాదం.. పుట్టినరోజు కుమార్తెను చూడనివ్వని భార్య.. ఆత్మహత్యకు పాల్పడిన శాస్త్రవేత్త

Sarath Chandra.B HT Telugu

‌Hyd Scientist Suicide: భార్య వేధింపులు తాళలేక శాస్త్రవేత్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన పొట్టి రామకృష్ణ హైదరాబాద్‌లో విష పదార్ధం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కూతుర్ని చూడనివ్వలేదని శాస్త్రవేత్త ఆత్మహత్య

‌Hyd Scientist Suicide: కుమార్తెను చూడనివ్వకుండా, ఆమె పుట్టిన రోజున కొత్త బట్టలు కొనవ్వకుండా అడ్డుకుని దాడి చేయడంతో మనస్తాపం చెెందిన భర్త హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విడాకుల సమయంలో పిల్లలు ఆడవారి ఆస్తులు కాకూడదని లేఖ రాసి బలవన్మరణం పాలయ్యాడు. తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని తమ్ముడికి సూచించాడు.

భార్య తన చావు కోరుకుందని, కుమార్తెను తల్లికి అప్పగించడంతో తల్లడిల్లిన తండ్రి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని విడిచి ఉండలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ‌్ర ప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో లక్ష్మీ తులసి కిరాణా మర్చంట్స్ పేరిట వ్యాపారం చేసే పొట్టి సత్యనారా యణ, భారతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వీరి పెద్ద కుమారుడు రామకృష్ణ హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. రామకృష్ణకు 15 ఏళ్ల కిందట నరసరావుపేటకు చెందిన ఉజ్వలతో వివాహం జరిగింది. వీరికి కుమార్తె మేధ ఉంది. కొంతకాలం క్రితం ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో గొడవలు జరిగాయి. మూడేళ్ల క్రితం రామకృష్ణ తన తల్లి భారతికి మోకాలు ఆపరేషన్ చేయించాడు. ఆ సమయంలో ఆస్పత్రి ఖర్చులు రామకృష్ణ భరించడంపై భార్య ఉజ్వల భర్తతో గొడవ పడి విడాకుల వరకు వెళ్లింది.

ఏడాదిన్నరగా కుమార్తెను చూడనివ్వకుండా…

ఆ తర్వాత భర్తతో తెగతెంపులు చేసుకుని కుమార్తె శ్రీమేధతో కలిసి ఏడాదిన్నరగా నరసరావుపేటలో తల్లి ధనలక్ష్మి, సోదరుడు అనిల్ వద్ద ఉజ్వల ఉంటోంది. ఏడాదిన్నరగా కూతుర్ని చూడనివ్వకపోవడంతో రామకృష్ణ ఆవేదన చెందాడు. ఇటీవల కుమార్తె శ్రీమేద పుట్టినరోజు కావడంతో కొత్త బట్టలు కొని శుభాకాంక్షలు తెలిపేందుకు గత సోమవారం రామకృష్ణ నరసరావుపేటకు వెళ్లాడు.

నరసరావుపేటలో భార్య, అత్తింటి వారు రామకృష్ణను ఇంట్లోకి అనుమతించ లేదు. వారి తీరుతో విసుగు చెంది అత్త, బావమరిదిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీస్‌ కేసు నమోదు కావడంతో రామకృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత పెదకూరపాడు వచ్చి తల్లిదండ్రులు, సోదరుడిని కలిశాడు. మంగళవారం హైదరాబాద్ వెళ్లారు.

భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని…

హైదరాబాద్‌ చేరుకున్న కొద్ది గంటల్లోనే వనస్థలిపురంలోని తన ఇంట్లో విష పదార్ధం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోర్టును అడ్డు పెట్టుకుని భార్య తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను వాట్సప్ స్టేటస్‌లో పెట్టారు. రామకృష్ణ బంధువులు మృతదేహాన్ని బుధవారం పెదకూరపాడు గ్రామానికి తరలించారు.

 

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం