Traffic Rules In Hyderabad : ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే అంతే.. 28 నుంచి స్పెషల్ డ్రైవ్-traffic rules special drive in hyderabad from november 28
Telugu News  /  Telangana  /  Traffic Rules Special Drive In Hyderabad From November 28
ట్రాఫిక్ పోలీసులు (ఫైల్ ఫొటో)
ట్రాఫిక్ పోలీసులు (ఫైల్ ఫొటో) (Twitter)

Traffic Rules In Hyderabad : ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే అంతే.. 28 నుంచి స్పెషల్ డ్రైవ్

21 November 2022, 21:46 ISTHT Telugu Desk
21 November 2022, 21:46 IST

Hyderabad Traffic Rules : నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్‌ తెలిపారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ వారం పాటు వాహన దారులను ఎడ్యుకేట్ చేయనున్నట్టుగా పేర్కొన్నారు.

ఇకపై వాహనాల మీద ఇష్టం వచ్చినట్టుగా వెళితే.. భారీగా జరిమానాలు పడనున్నాయి. ట్రాఫిక్(Traffic) నిబంధనలపై కమిషనర్ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా(Social Media)లో ఈ డ్రైవ్ పై రకరకాల చర్చలు నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి తీసుకు రాబోతున్న నిబంధనలు కొత్తవి కాదని, 2013 మోటార్ వెహికల్ యాక్ట్ జీవోలో ఉన్నవేనని తెలిపారు. ఇక నుంచి రాంగ్‌రూట్‌(Wrong Route), ట్రిబుల్‌ రైడింగ్‌(Triple Riding) చేస్తే కఠినంగా వ్యవహరించనున్నట్టుగా తెలిపారు. ప్రయాణికుల్లో అవగాహన పెంచేలా ఈనెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్(Special Drive) చేపడుతున్నారు.

'రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం. ప్రయాణికులలో కొత్త నిబంధనలపై అవగాహన కోసం.. ఈనెల 28 నుంచి ప్రత్యేక ట్రాఫిక్‌ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. వాహనాలు(Vehicles) నిబంధనలు అతిక్రమిస్తే ఎక్కువ మొత్తంలో జరిమానా(Fine) విధించాలని నిర్ణయించాం. రాంగ్ రూట్‌లో రావడం, ట్రిపుల్‌ రైడింగ్‌ చేయడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించని వాహనాలకు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నాం.' అని ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ రంగనాథ్‌ తెలిపారు.

జీవో ప్రకారమే కొత్త రవాణా నిబంధనలు అమలు చేస్తామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై జరిమానాలు పెంచుతున్నామన్నారు. రాంగ్‌రూట్‌(Wrong Route) డ్రైవింగ్‌కు రూ.1700 జరిమానా విధిస్తున్నామని, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 జరిమానా వేయనున్నట్టుగా ప్రకటించారు. ఆదాయం(Income) కోసం జరిమానాలు వేస్తున్నామనేది అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. యూ టర్న్‌(U Turn)లపై తాము కూడా పునసమీక్షిస్తామన్నారు. తరచూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక చర్యలు ఉంటాయన్నారు.

'పోలీసులు, ప్రభుత్వం(Govt)పై సామాజిక మాధ్యమాల్లో అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు శాఖకు వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తోంది. ట్రాఫిక్‌ చలాన్లను ఆదాయ వనరుగా ఎప్పుడూ మేం పరిగణించలేదు. కేవలం చలాన్ల మీదనే పోలీసులు దృష్టి పెడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నగరంలో అనేక ప్రాంతాల్లో.. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్(Parking) చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటప్పుడు చలాన్ వేస్తాం.' అని రంగనాథ్ చెప్పారు.

ట్రాఫిక్‌(Traffic) క్రమబద్ధీకరణలో భాగంగానే ఇదంతా చేస్తున్నామని జాయింట్ కమిషన్ పేర్కొన్నారు. అందుకోసమే.. ఆపరేషన్‌ రోప్‌ను ప్రారంభించామన్నారు. వాహనదారుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలో కావాల్సిన చోట్ల యూ టర్న్‌లు ఏర్పాటు చేసే విషయంపై సమీక్ష చేస్తామన్నారు. గతంలో కంటే.. ప్రస్తుతం ఫైన్స్ తగ్గించామని చెప్పారు. వాహన రకాన్ని బట్టి ఫైన్స్ విధిస్తామని, వాహనదారుల్లో మార్పు కోసమే ఈ నిబంధనలని స్పష్టం చేశారు.