Revanth Reddy : వరంగల్ ఈస్ట్ లో సురేఖమ్మ గెలుపు ఖాయం.. రేవంత్ రెడ్డి
Revanth Reddy : రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర కొనసాగుతోంది. 13వ రోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకున్న ఆయన... ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు.
Revanth Reddy : తెలంగాణలో ఈ 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం తప్ప.. రాష్ట్రంలో ఏ వర్గానికి మేలు జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్లలో వెయ్యి ఎకరాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్... కొడుకుకు 500 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ రావణకాష్టానికి పరిష్కారం లేదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన అన్నవాళ్లకి రెండు సార్లు అధికారం ఇచ్చారని.... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. యాత్ర ఫర్ ఛేంజ్ పేరిట.. హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రలో భాగంగా... వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ట్రెండింగ్ వార్తలు
వరంగల్ అంటే ప్రేమ అంటున్న కేసీఆర్ కు ఇక్కడి భూములు, ఆస్తులపైనే ప్రేమ ఉందని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి. గొప్ప చరిత్ర ఉన్న వరంగల్ కు 2014లో గ్రహణం పట్టిందన్నారు. ప్రపంచానికి మేధావులను అందించిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీదని.. అలాంటి కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు లేవు, ప్రొఫెసర్లు లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు. కొండా దంపతుల మీద కోపంతో వరంగల్ ను దండుపాళ్యం ముఠా చెత్త కుప్పగా మార్చారని మండిపడ్డారు.
పౌరుషానికి మారుపేరైన ఈ గడ్డపై బిల్లా రంగా లాంటి ఎమ్మెల్యేలు అవసరమా ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. వరంగల్ లో ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నారా ? అని అడిగారు. బీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకుని దోచుకుంటున్నారని... అజాం జాహీ మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన భూమి ఈ ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప వరంగల్ లో ఈ తొమ్మిదేళ్లలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు. వరంగల్ లో కొండా దంపతులను ఆశీర్వదించాలని... వారు ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటారని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో వారికి ఎలాంటి గౌరవం దక్కిందో.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే గౌరవం ఉంటుందని చెప్పారు. వరంగల్ ఈస్ట్ లో సురేఖమ్మ గెలుపు ఖాయమని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసిన రేవంత్... వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే పేదలకు రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని... నిరుపేద రైతులకి ఏటా రూ. 15 వేల పెట్టుబడి సహాయం అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించుకుందాం... ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.