Tiger Fear: జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మొక్క జొన్న చేను వద్ద పులిని గమనించి స్థానిక రైతులు వీడియో తీసి పోస్టు చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. పులి సంచారం వార్తతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతుండగా.. పొలాల వద్దకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు. చేను వద్దకు ఒంటరిగా కాకుండా గుంపులుగుంపులుగా వెళ్తున్నారు.
గోరికొత్తపల్లిలో పులి తిరుగుతున్న విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పులికి సంబంధించిన వీడియో ఇక్కడిది కాదని, ఎక్కడిదో వీడియోను కావాలనే గోరికొత్తపల్లికి సంబంధించిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. పులి సంచారం అంతా తూచ్ అంటూ కొట్టి పడేస్తున్నారు.
గోరికొత్తపల్లి మండల కేంద్రంలో పులి సంచరిస్తుందని గ్రామస్థులు చెబుతుండగా.. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో రెండు రోజులుగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ మేరకు పులి సంచారం విషయాన్ని కొంతమంది గ్రామస్థులు ఫారెస్ట్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు, చెల్పూరు రేంజ్ అటవీ శాఖ అధికారులు, ఇతర సిబ్బంది రంగంలోకి దిగారు.
గురువారం ఉదయం గ్రామానికి చేరుకుని, చుట్టుపక్కల రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గోరికొత్తపల్లి శివారు ప్రాంతాలు, పంట పొలాలను పరిశీలించారు. పొలం గట్లపై పులి సంచరిస్తున్నట్టుగా వీడియోలో కనిపించిన ప్రాంతంలో పాద ముద్రలు సేకరించే పనిలో పడ్డారు.
అటవీ శాఖ అధికారులు దాదాపు రెండు, మూడు గంటల పాటు గోరికొత్తపల్లి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. అక్కడున్న పాద ముద్రలు, ఇతర ఆనవాళ్లను గుర్తించారు. చివరకు అది పులి కాదని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఇదే విషయాన్ని గ్రామస్థులకు స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
గోరికొత్తపల్లి శివారు పంట పొలాల్లో సంచరించింది జంగ పిల్లి లేదా.. అదే జాతికి చెందిన మరేదైనా జంతువు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేత కోసం వచ్చిన సమయంలో ఎవరైనా వీడియో తీసి ఉంటారని, అది మాత్రం పులి కాదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించినా జంగ పిల్లిగానే కనిపిస్తోందన్నారు.
పులి సంచారం గురించి వదంతులు నమ్మవద్దన్నారు. మున్ముందు ఇలాంటి జంతువులు సంచరిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని, దానికి అనుగుణంగా తాము చర్యలు తీసుకుంటామని ములుగు, చెల్పూర్ రేంజ్ అటవీ శాఖ అధికారులు అక్కడి ప్రజలకు సూచించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం