TFI DilRaju: టిక్కెట్ ధరలు పెంపు, అదనపు షోలు సినీ పరిశ్రమకు ముఖ్యం కాదన్న దిల్ రాజు
TFI DilRaju: తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోందని అందుకు అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజు ప్రకటించారు. టిక్కెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు పరిశ్రమకు ముఖ్యం కాదన్నారు.
TFI DilRaju: బెనిఫిట్ షోలకు అనుమతులు, టిక్కెట్ ధరల పెంపు వంటి తెలుగు సినీ పరిశ్రమకు చిన్న విషయాలని అంతర్జాతీయ స్థాయికి సినీ పరిశ్రమను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత్ దిల్ రాజు తెలిపారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రితో సమావేశాల వివరాలను వెల్లడించారు.
బెనిఫిట్ షోలు, టిక్కెట్ ధరలు తమకు ముఖ్యం కాదని తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమకు ముఖ్యమన్నారు. ధరల పెంపు, షోలకు అనుమతుల ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుందన్నారు.
ఎఫ్డిసి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి తరపున కొన్ని అంశాలను బ్రీఫ్చేసినట్టు దిల్ రాజు చెప్పారు. ఎఫ్డిసి ఛైర్మన్ ద్వారా సమావేశం వివరాలను కమ్యూనికేట్ చేయాలని సీఎం సూచించడంతో అందరి తరపున మాట్లాడుతున్నట్టు చెప్పారు. సీఎం విజన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెవల్లో దేశ వ్యాప్తంగా అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకుల నుంచి గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినీ పరిశ్రమకు గుర్తింపు రావడానికి కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లో బాలీవుడ్, కన్నడ, కేరళ, తమిళ సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయని, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాలు షూటింగ్ చేయడానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరినట్టు దిల్రాజు చెప్పారు.
ఇండస్ట్రీకి ఏమి కావాలో చెబుతామని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ హబ్ చేయడానికి అడుగులు వేస్తామ్నారు. ప్రభుత్వానికి సంబంధించి యువతకు, సమాజానికి ఉపయోగపడేలా ఇండస్ట్రీ నుంచి భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారని, డ్రగ్స్ వినియోగం విషయంలో అవగాహన కల్పించడానికి ముందుకు రావాలని కోరినట్టు చెప్పారు.
ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసిపనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇండస్ట్రీకి ఏమి కావాలో తెలంగాణ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరపున ముఖ్యమంత్రికి వివరించినట్టు చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు చెప్పారు. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషిచేస్తామన్నారు.
అంతకు ముందు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు రెండు గంటల పాటు తెలుగు సినీ ప్రముఖులతో సీఎం సమావేశం అయ్యారు. కక్ష సాధింపు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని సీఎం స్పష్టం చేవారు. సీఎంలు అంతా హైదరాబాద్లో సినీ పరిశ్రమను బాగానే చూసుకున్నారని రాఘవేంద్ర రావు అన్నారు, ఎఫ్డిసి ఛైర్మన్గా దిల్ రాజు నియామకాన్ని స్వాగతించారు.
తెలంగాణలో టూరిస్ట్ స్పాట్లను సినిమాల షూటింగ్లకు వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో చంద్రబాబు హయంలో చిల్ట్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగాయని, ఇంటర్నేషనల్ చిల్డన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏపీలో నిర్వహించాలని కోరారు. యూనివర్సల్ స్థాయి స్టూడియో నిర్మించాలని నాగార్జున సమావేశంలో సూచించారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై గతంలో ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి వెళుతుందని నాగార్జున సూచించారు. హైదరాబాద్ ప్రపంచ సినీ రాజధాని కావాలని నాగార్జున అకాంక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని నాగార్జున ముఖ్యమంత్రికి సూచించారు.
బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వ వైఖరిపై సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప 2 సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతించి, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చినా సినిమా పరిశ్రమపై కక్ష సాధిస్తోందని ప్రచారం చేయడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో సినీ పరిశ్రమను భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు.