కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బలగాలు అలర్ట్ అయ్యాయి. క్షుణ్నంగా పరిశీలిస్తూ.. ముందుకు సాగుతున్నాయి.
ఏప్రిల్ 8న సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ లేఖ విడుదలైన తర్వాత.. బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టాయి. అప్పటి నుంచి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.
'ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న దాడులలో అనేక మంది మావోయిస్టు పార్టీ నేతలు, పీఎల్జీఏ నాయకులతో పాటు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లలో అమరులు అవుతున్న వారిలో ఎక్కువ మంది ఆదివాసీ ప్రజలే ఉంటున్నారు. ఈ ఆపరేషన్ కగార్ దాడుల నుంచి రక్షణ పొందడానికే కర్రిగుట్టపై బాంబులు అమర్చాం' అని మావోయిస్టులు స్పష్టం చేశారు.
25 వేల మంది సిబ్బంది 12 రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కర్రెగుట్టల్లో నిర్విరామంగా గాలిస్తున్నా.. ఆశించిన ఫలితం రావడం లేదు. అధికారికంగా ముగ్గురు మహిళా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించగా.. మరో 20 మంది వరకూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి బలగాలు అంచనా వేసినట్లు అగ్రనేతలతో సహా దాదాపు 1000 మంది మావోయిస్టులు ఏమైపోయినట్లు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది మావోయిస్టుల ఎత్తుగడగానే భావించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటి వరకు చేపట్టిన గాలింపులో మావోయిస్టుల జాడ తెలీలేదు. దీంతో అసలు ఇక్కడ అగ్రనేతలు ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా మావోయిస్టుల వ్యూహమేనని, తామంతా ఇక్కడే ఉన్నట్లు పోలీసుల దృష్టి మళ్లించి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయి ఉంటారనే వాదన తెరపైకి వస్తోంది. కర్రెగుట్టల్లో మందుపాతరలు పెట్టామని, గిరిజనులు ఎవరూ రావద్దని బహిరంగ ప్రకటన చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. మరి మావోయిస్టులు కర్రెగుట్టలను వదిలి ఉంటే.. ఎక్కడికి వెళ్లారనేది ప్రశ్నగా మారింది.
సంబంధిత కథనం