TG Mlc Elections: ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం.... మార్చి 3న ఎన్నికల ఫలితాలు-the verdict of the mlc voters is deposited in the ballot boxes election results on march 3rd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections: ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం.... మార్చి 3న ఎన్నికల ఫలితాలు

TG Mlc Elections: ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం.... మార్చి 3న ఎన్నికల ఫలితాలు

HT Telugu Desk HT Telugu

TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయింది. ఓటర్ల తీర్పు గల బ్యాలెట్ బాక్సులను 15 జిల్లాలను కరీంనగర్ కు తరలించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరిన బ్యాలెట్ బాక్సులు

TG Mlc Elections: ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల తీర్పు మార్చి 3న వెలువడనుంది. బ్యాలెట్ బాక్సుల్ని కట్టుదిట్టమైన భద్రత మద్య కరీంనగర్ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రతిష్టాత్మకంగా భావించిన ఉత్తర తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, టీచర్ లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు బరిలో నిలువగా 70.42 శాతం పోలింగ్ నమోదైంది.

15 జిల్లాల పరిధిలో 355159 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా 250103 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా 91.90 శాతం పోలింగ్ నమోదు అయింది. భూపాలపల్లి జిల్లా 79.50 శాతం పోలింగ్ తో మొదటి స్థానం కామారెడ్డి జిల్లా 78.12 శాతం పోలింగ్ తో రెండో స్థానంలో నిలువగా అతి తక్కువ 64.64 శాతం పోలింగ్ తో కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

టీచర్స్ ఓటర్లు 27088 మంది ఉండగా 24893 మంది టీచర్ లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.‌ మెదక్ జిల్లా 95.03 శాతం పోలింగ్ తో మొదటి స్థానంలో ఉండగా 94.83 శాతం పోలింగ్ తో సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో ఉంది. 82.10 శాతం పోలింగ్ తో నిర్మల్ జిల్లా ఆఖరి స్థానం పొందింది.

మద్యాహ్నం తర్వాత పోటెత్తిన ఓటర్లు...

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించారు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. లంచ్ తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.‌ మూడు గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.

క్యూ లో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్ నిర్వహించారు. 773 పోలింగ్ కేంద్రాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 6.37 శాతం, టీచర్స్ పోలింగ్ 13.10 శాతం నమోదయ్యింది.

మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 19.20 శాతం, టీచర్స్ పోలింగ్ 33.98 శాతం నమోదయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 40.61 శాతం, టీచర్ పోలింగ్ 63.49 శాతం నమోదు అయింది. చివరి ఘడియలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది చివరి రెండు గంటల్లో భారీగా పోలింగ్ నమోదయింది.

పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసేసరికి పట్టభద్రుల పోలింగ్ 70.42 శాతం, టీచర్స్ పోలింగ్ 91.90 శాతం నమోదయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు.

కరీంనగర్ కు బ్యాలెట్ బాక్సులు తరలింపు...

పోలింగ్ ముగిసిన అనంతరం ఓటర్ల తీర్పు నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి భద్రంగా కరీంనగర్ కు తరలించారు. 15 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 773 పోలింగ్ కేంద్రాల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్ లోని ఇండోర్ స్టేడియంకు తరలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు.‌ బ్యాలెట్ బాక్స్ ల తరలింపు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.

మూడంచెల భద్రత...

బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ లోని ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలు పర్యవేక్షణతో పాటు సెంట్రల్ ఫోర్స్, స్టేట్ రిజర్వు పోలీస్, స్థానిక సివిల్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ను కరీంనగర్ సిపి అభిషేక్ మోహంతి పరిశీలించి పోలీసులకు తగు సూచనలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలోకి కౌంటింగ్ ముగిసే వరకు ఎవరికీ అనుమతి లేకుండా నిషేధాజ్ఞలు విధించారు.

ఎవరి అంచనాలు వారివే..

పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలింగ్ సరళిని భట్టి ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మల్క కొమురయ్య గెలుపు నల్లేరుపై నడకలా మారింది. బీజేపీ ఖాతాలో ఒక ఎమ్మెల్సీ వస్తుండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ట్రయాంగిల్ పోటీ కొనసాగింది.

కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా చిన్న మెయిల్ అంజిరెడ్డి పి ఎస్ పి అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేయగా రవీందర్ సింగ్ వెనుకబడిపోయారు. ప్రసన్న హరికృష్ణకు బిఆర్ఎస్ పరోక్షంగా సహకరించడంతో రెండు అధికార పార్టీల అభ్యర్థులకు దీటుగా ఆయనకు ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి ప్రచారం నిర్వహించగా చివరి రెండు రోజుల్లో బిఆర్ఎస్ పరోక్షంగా ప్రసన్న హరికృష్ణకు సహకరించడంతో ట్రయాంగిల్ పోటీ నెలకొని స్వల్ప మెజార్టీతో ముగ్గురులో ఒకరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం