Karimnagar Shivaratri: వైభవంగా లింగోద్భవం... వేములవాడ లో కన్నుల పండువలా మహా లింగార్చన…-the great lingarachana in vemulawada celebrated grandly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Shivaratri: వైభవంగా లింగోద్భవం... వేములవాడ లో కన్నుల పండువలా మహా లింగార్చన…

Karimnagar Shivaratri: వైభవంగా లింగోద్భవం... వేములవాడ లో కన్నుల పండువలా మహా లింగార్చన…

HT Telugu Desk HT Telugu

Karimnagar Shivaratri: మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవోపేతంగా జరిగాయి.‌ శైవక్షేత్రాలన్ని భక్తులు కిటకిటలాడాయి. శివన్నామస్మరణతో మారుమ్రోగాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా లింగార్చన, లింగొద్బవ సమయాన మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.

వేములవాడలో పూజలు చేస్తున్న మంత్రి పొన్నం, ఇన్‌సెట్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్

Karimnagar Shivaratri: మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవోపేతంగా జరిగాయి.‌ శైవక్షేత్రాలన్ని భక్తులు కిటకిటలాడాయి. శివన్నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం జన సందోహంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బారులు తీరి రాత్రంతా జాగరణ తో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

దర్శనానికి ఐదు నుంచి 6 గంటల సమయం పట్టింది. రాజన్న ఆలయం తోపాటు కరీంనగర్ లోని పాత బజార్ లో గల శివాలయానికి, కోటిలింగాల లోని కోటేశ్వర స్వామి ఆలయానికి, పెంబట్ల దుబ్బ రాజన్న, పొట్లపల్లి స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోరిన కోర్కెల తీర్చే కోడెమొక్కుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా లింగార్చన కన్నుల పండువలా నిర్వహించారు.128 అనువంశిక అర్చక కుటుంబాలచే మహాలింగార్చనను అద్దాల మండపంలో నిర్వహించారు. 365 మృత్తిక లింగాలను లింగాకారంలో పేర్చి ప్రాణ ప్రతిష్ట చేశారు.

అనంతరం అభిషేకం గావించారు. అనంతరం ప్రత్యేక పూజలు, మంగళ హారతులు, మంత్రపుష్పం వేద మంత్రాలతో వైభవంగా దాదాపు రెండున్నర గంటలకు పైగా మహాలింగార్చన అనంతరం లింగాలను ధర్మగుండంలో నిమజ్జనం చేశారు.

ఆలయాలకు విఐపిల తాకిడి...

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు విఐపిల తాకిడి పెరిగి సామాన్య భక్తులు ఇక్కట్లు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్ఎండి కాలనీలో శ్రీమృత్యుంజయ ఆలయంలో పొట్లపల్లి స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాత్రంతా జాగరణ చేసే భక్తుల కోసం జాతర గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బోలాశంకరుడికి చెంబెడు నీళ్ళతో అభిషేకించినా, ఉపవాసం ఉన్నా ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు శివాలయాలకు చేరుకొని శివన్నామస్మరణ అభిషేకం చేశారు. ఆలయ అధికారులు నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పించారు.

వేములవాడ కు ప్రత్యేకత...బండి సంజయ్

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేకత ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని కోడె మొక్కు చెల్లించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.

వేములవాడ రాజన్న ప్రత్యేకత ప్రాముఖ్యత తెలుసుకునేందుకు హిందూ సమాజమంతా ఆసక్తి చూపుతుందని తెలిపారు. మహిమగల రాజన్నను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందన్నారు. శివరాత్రి సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నానని చెప్పారు. ఆలయాలకు నేరుగా కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం లేదన్న బండి సంజయ్, ఆలయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. శివరాత్రి సందర్భంగా రాజకీయాలు మాట్లాడ దలుచుకోలేదని స్పష్టం చేశారు.

ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయండి... కవిత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.‌ శివరాత్రి రోజున కోరిన కోర్కెలు తీర్చే కోడెమొక్కుల రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కేసిఆర్ హాయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ కోసం 250 కోట్లు కెటాయించి 30 ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. రాజన్న సన్నిధిలో రాజకీయాలు మాట్లాడొద్దనుకున్నా... కానీ తప్పడం లేదని తెలిపారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తుల సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు.

చల్లగా చూడాలని....మంత్రి పొన్నం

మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పలు శివాలయాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించి శివుడికి అభిషేకం చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ ఆలయాన్ని సందర్శించే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పొట్లపల్లిలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గొట్లమిట్టలోని శివాలయాన్ని సందర్శించి అభిషేకం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సక్సెస్ కావాలని శివుడిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

గోదావరికి పోటెత్తిన భక్తులు...

మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం కోటిలింగాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడింది. పుణ్య స్నానాలు ఆచరించి కొటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అటు మంథని లో సైతం గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గౌతమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

సంబంధిత కథనం