Cancel Vote In Andhra: ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోవాలన్న హరీష్ రావు…కారణం అదే
Cancel Vote In Andhra: హైదరాబాద్లో స్థిర పడిన ఆంధ్రా కార్మికులు ఏపీలో తమ ఓటు హక్కును రద్దు చేసుకోవాలని తెలంగణ మంత్రి హరీష్ రావు సూచించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగమయ్యే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో అంతర్భాగమేనన్నారు.
Cancel Vote In Andhra: తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ కార్మికులు సొంత రాష్ట్రంలో ఓటు హక్కును రద్దు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. మేడే రోజున కార్మికులు కేసీఆర్ నోట మరి కొన్ని శుభవార్తలు వింటారని హరీశ్ రావు చెప్పారు. సంగారెడ్డిలో భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఏపీలో రోడ్లు, ధవఖానాల పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధిలో ఏపీకి,తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణలో ఉన్న ఆంధ్రా కార్మికులు ఏపీలో ఓటు హక్కును క్యాన్సిల్ చేసుకుని.. ఇక్కడే ఓటర్లుగారిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే ప్రతి కార్మికుడు రాష్ట్రంలో అంతర్భాగమేనని హరీశ్ అన్నారు. తెలంగాణలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టకపోవడంతో కేంద్రం 30 వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుందని ఆరోపించారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు.
ఆంధ్రా ఓట్లపై అప్పుడే కన్ను….
ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయానికి అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 37లక్షల మంది ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు ఉన్నారు. 2018నాటికి అది 40లక్షలకు చేరింది. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన వారు వీరిలో ఉన్నారు. వీరందరికి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉంది.
తెలంగాణలో ఆంధ్రా ఓటర్ల ప్రభావం ఉన్న నియోజక వర్గాలు 50-55 వరకు ఉంటాయి. వీటిలో 34 నియోజక వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే స్థాయిలో ఆంధ్రా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈసీ డేగకన్నుతో అప్రమత్తం….
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను తొలగించాలనే అంశం తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల్లోను ఓటర్లుగా ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో ఏక కాలంలో రెండు రాష్ట్రాల్లో ఓటు వేసే అవకాశం ఉండదనే కారణంతో దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో 2018లో తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఆ తర్వాత ఏపీలో కూడా ఓట్లు వేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పాల్గొన్న వారు, ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఓట్లు వేశారు.
తాజాగా ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం ఒక ఓటరుకు ఒక ప్రాంతంలోనే ఓటు హక్కు ఉండేలా ఆధార్ కార్డుతో అనుసంధానిస్తోంది. ఆధార్తో అనుసంధానం స్వచ్ఛంధమే అయినా ఏపీలో ఓటర్లతో సంబంధం లేకుండానే ఆ పని పూర్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమిస్తే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి జాబితా సులువుగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఏపీలో ఓటు హక్కను రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని హరీష్ రావు సూచించినట్లు స్పష్టమవుతోంది.